
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఎన్ఎస్యూఐ నాయకులు ధర్నాకు దిగారు. టెట్ పరీక్ష తేదీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అదే రోజు ఆర్ఆర్బీ పరీక్ష ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేతలు.. టెట్ పరీక్షను వాయిదా వేయాలని కోరారు. విద్యా శాఖ మంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా పలువురు నాయకులు సబితా ఇంద్రారెడ్డి ముందు కూర్చుని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఎన్ఎస్యూఐ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇటీవల టెట్ పరీక్ష వాయిదా వేయాలనే డిమాండ్పై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పరీక్షను వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. ఇక, తెలంగాణలో టెట్ పరీక్ష నిర్వహణ తేదీపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. TS TET 2022 ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టుగా తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టెట్ పరీక్ష రోజే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష ఉన్నందున.. టెట్ పరీక్ష వాయిదా వేయాలని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్ను కోరారు. ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ ఉండటం వలన అభ్యర్థులు అయోమయానికి గురవతున్నారని.. టెట్ పరీక్ష వాయిదా వేయగలరని మనవి చేస్తున్నట్టుగా చెప్పారు.
ఈ ట్వీట్పై స్పందించిన మంత్రి కేటీఆర్.. దానిని పరిశీలించాల్సిందిగా మంత్రి సబిత ఇంద్రారెడ్డి ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. టెట్ పరీక్షను వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. తాను విషయం వెల్లడించడానికి ముందు సంబంధిత అధికారులతో మాట్లాడానని చెప్పారు. టెట్ పరీక్షలో సుమారు 3.5 లక్ష మంది పాల్గొనున్నారని చెప్పారు. ఇతర పోటీ పరీక్షలతో క్లాష్ కాకుండా పరీక్షా తేదీలను నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇతర అన్ని అంశాలను పరిగణలు తీసుకున్న నేపథ్యంలో.. టెట్ వాయిదా కుదరదని చెప్పారు.