జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ, ధర్మపురి అర్వింద్. టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఊహించిందేనని అర్వింద్ అన్నారు.
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ, ధర్మపురి అర్వింద్. టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఊహించిందేనని అర్వింద్ అన్నారు.
నల్గొండ జిల్లా హాలియా సభలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు సీఎం కేసీఆర్ సంతాపం కూడా తెలపలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇవ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం సీఎంకు పరిపాటి అని అర్వింద్ విమర్శించారు.
గిరిజన మహిళల పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిలకు అర్వింద్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్యం అవసరం లేదని.. రామరాజ్యం కావాలని చెప్పారు.
Also Read:చేవెళ్ల సెంటిమెంట్: ఏప్రిల్ 10న వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ
అంతకుముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందం మరోసారి బహిర్గతమైందన్నారు. మతతత్వ పార్టీ ఎంఐఎంకు టీఆర్ఎస్ చెంచా అని రుజువైందని సంజయ్ మండిపడ్డారు.
జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని ఆయన ఆరోపించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఇద్దరు దొంగలు కలిసి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మేయర్ స్థానానికి పోటీ చేస్తామన్న ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్- ఎంఐఎం కలిసి పోటీ చేసుంటే 15 సీట్లు కూడా రాకపోయేవని రాజాసింగ్ అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం తమబొంద తామే తవ్వుకున్నాయన్నారు