
పెళ్లైన వారానికే భార్యను వదిలించుకోవడానికి వేధింపులకు పాల్పడుతున్న అత్తింటి ఎదుట కోడలు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్, నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్టౌన్కాలనీలో చోటు చేసుకుంది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ భగత్నగర్కాలనీకి చెందిన గుంజి శ్రీనివాస్, పద్మలకు ఇద్దరు కూతుర్లు. ఉద్యోగరీత్యా శ్రీనివాస్ ముంబాయిలో ఉంటున్నాడు. ఈ ఏడాది జనవరిని వీరి పెద్ద కూతురు తేజస్విని వివాహం రాక్ టౌన్ కాలనీకి చెందిన బత్తులు ఏడుకొండలు, సుశీల పెద్ద కొడుకు వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేశ్వర్లుతో జరిగింది.
వెంకటేశ్వర్లు హైదరాబాద్ లోని క్లేవ్టెక్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తేజస్విని బిబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. పెళ్లి టైంలో రూ. 20 లక్షల వరకు బంగారం, కట్న కానుకల కింద అందించారు. వెంకటేశ్వర్లు నాన్నమ్మ అనారోగ్యంతో ఉందని అబద్దం చెప్పి పెళ్లి తొందరగా చేశారు. వారం రోజుల తరువాతి నుంచి వేధింపులు మొదలుపెట్టారు.
భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు చెబుతోంది. తనను ఎలాగైనా వదిలించుకోవాలని పథకం ప్రకారం కాపురానికి తీసుకురాకుండా పుట్టింటి వద్దనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
భర్త వెంకటేశ్వర్లు కాపురానికి పనికి రాడని, ఈ విషయం కుటుంబసభ్యులకు కూడా తెలిసినా, పెళ్లి చేశారని ఆమె పేర్కొన్నారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించారు.
దీనిమీద ఈ నెల 24న ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేయగా అక్కడ వారికి కౌన్సెలింగ్ చేశారు. పెద్దల సమక్షంలో రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించుకుంటామని తన భర్త కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారన్నారు.
అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో మంగళవారం ఉదయం అత్తింటి ఎదుట న్యాయం చేయాలంటూ బాధితురాలు ధర్నాకు దిగింది.