నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామానికి చెందిన సోమేష్(27) కు ఈ నెల 11వ తేదీన పెళ్లవగా మొదటిరాత్రి రోజు ఆత్మహత్య చేసుకున్నాడు.
నల్గొండ: పెళ్లయి కేవలం 11రోజులయ్యింది. సాంప్రదాయం ప్రకారం పెద్దలు మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఏమయ్యిందో ఏమో తెలీదు కానీ వరుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామానికి చెందిన సోమేష్(27) కు ఈ నెల 11వ తేదీన పెళ్లయ్యింది. నాగారం మండలం ఫణిగిరికి చెందిన మేనమామ కూతురిని అతడు పెళ్లాడాడు. అయితే మొదటిరాత్రి కోసం పెద్దలు అన్ని ఏర్పాట్లు చేయగా సోమేష్ స్నేహితులను కలిసి వస్తానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. కానీ ఎంతకూ తిరిగిరాలేదు.
రాత్రంతా అతడి కోసం ఎదురుచూశారు కుటుంబసభ్యులు, నవవధువు. తెల్లారినా అతడు ఇంటికి రాకపోవడంతో ఆఛూకీ కోసం వెతకడం ప్రారంభించారు. చుట్టుపక్కల గాలించగా పాడుబడిన ఓ పూరి గుడిసెలో సోమేష్ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. మృతుడి తల్లి అంతమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.