నీట్ ఫలితాలు : టాప్ 50లో 8మంది తెలుగు విద్యార్థులు.. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావుకు 5వ ర్యాంకు...

By Bukka SumabalaFirst Published Sep 8, 2022, 8:37 AM IST
Highlights

నీట్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. టాప్ 50లో ఎనిమిదిమంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. కాగా తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ రావు ఐదో ర్యాంకు సాధించాడు. 

ఢిల్లీ : తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ రావు 711 మార్కులతో నీట్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. 710 మార్కులతో ఏపీకి చెందిన మట్టా దుర్గా సాయి కీర్తి తేజ 12వ ర్యాంకు, 706 మార్కులతో నూని వెంకట సాయి వైష్ణవి 15వ ర్యాంకు, 705 మార్కులతో గుల్లా హర్ష వర్ధన్ నాయుడు 25వ ర్యాంకు సాధించారు. బాలికల్లో నూని వెంకట సాయి వైష్ణవి 6వ స్థానం, చప్పిడి లక్ష్మి చరిత్ర 14, వరుం అతిథి 20వ స్థానం దక్కించుకున్నారు. బాలుర విభాగంలో ఎర్రబెల్లి సిద్ధార్థ రావు 3, మట్టా దుర్గాసాయి కీర్తి తేజ 8, గుల్లా హర్షవర్ధన్ నాయుడు 14వ  స్థానాలను ఆక్రమించారు.

నీట్ ( యూజీ) 2022 ఫలితాలు బుధవారం అర్ధరాత్రి విడుదలయ్యాయి. మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు జూలై 17న పరీక్ష రాయగా అందులో 9,93,069 (56.27శాతం) మంది అర్హత సాధించారు. గత ఏడాది ఇది 56.34 శాతంగా నమోదైంది. మొత్తం ఉత్తీర్ణులైన అభ్యర్థులో ఓబీసీలు 45.03శాతం, ఎస్సీలు 13.26 శాతం, ఎస్టీలు 4 .76శాతం, జనరల్ 28.41శాతం, ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులు 8.46శాతం మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 68,061 మంది అభ్యర్థులునమోదు చేసుకుని పరీక్షకు 65,305మంది హాజరయ్యారు. అందులో 40,344 మంది (61.77శాతం) అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 61 వేల 207 మంది పేర్లు నమోదు చేసుకోగా పరీక్షకు 59, 296 మంది హాజరయ్యారు. అందులో 35,148 మంది (59.27శాతం)  అర్హత పొందారు. జాతీయ సగటుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువమంది అర్హత సాధించారు. రాజస్థాన్ కు చెందిన తనిష్క 715 మార్కులతో జాతీయస్థాయి తొలిర్యాంకును కైవసం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన వత్సా ఆశిష్ బాత్రా రెండవ స్థానం పొందారు.

టాప్ 50 లో ఎనిమిది మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. 705 మార్కులతో మంగ సముద్రం హర్షిత్ రెడ్డి 36వ ర్యాంకు, అంతే మార్కులతో తెలంగాణకు చెందిన చప్పిడి లక్ష్మీ చరిత 37వ ర్యాంకు, కంచన జీవన్ కుమార్ రెడ్డి 41వ ర్యాంకు, 700 మార్కులతో వరుం అథితి 50వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. దివ్యాంగుల్లో తెలంగాణకు చెందిన వాసర్ల జస్వంత్ సాయి  661 మార్కులు సాధించి దేశంలో తొలి ర్యాంకును ఆక్రమించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జూటూరి నేహ 695 మార్పులతో ఆల్ ఇండియాలో 134వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కోటాలో 10వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

నాగార్జున సాగర్ ఎడమకాల్వకు గండి.. 30 మీటర్ల మేర కొట్టుకుపోయిన కట్ట...

ఎస్సీ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొమ్ము ఆదర్శ్ 685 మార్కులతో జాతీయ స్థాయిలో ఏడు,ఆల్ ఇండియార్యాంకు విభాగంలో 453వ స్థానంలో నిలిచారు. ఎస్సీ కోటాలో తెలంగాణకు చెందిన మూదావత్ లితేష్ చౌహాన్ 688 మార్కులతో తొలిస్థానంలో, గూగులోతు శివాని 680 మార్కులతో రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వడిత్య తేజస్విని 675 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. వీరికి ఆలిండియా ర్యాంకుల్లో వరుసగా 400, 715, 1,112 దక్కాయి. అలాగే తెలంగాణకు చెందిన లవోద్య బ్రిండ  671 మార్కులతో 5, అనుమేహ భూక్య 670 మార్కులతో ఆరవ స్థానంలో నిలిచారు. ఆలిండియా ర్యాంకుల్లో 1374, 1619  దక్కించుకున్నారు. ఓబీసీ కోటాలో ఏపీకి చెందిన గుల్ల హర్ష వర్ధన్ నాయుడు మూడవ ర్యాంకు, తెలంగాణకు చెందిన చందల యశశ్విణిశ్రీ 8వ స్థానం సొంతం చేసుకున్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణలో ఎర్రబెల్లి  సిద్ధార్థ రావు,  ఆంధ్రప్రదేశ్లో మట్టా దుర్గాసాయి కీర్తితేజ తొలి స్థానంలో నిలిచారు.

కార్డియాలజిస్ట్ అవుతా…
మాది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సూరారం గ్రామం. హైదరాబాద్ కూకట్పల్లిలో ఉండి చదువుకుంటున్నాను. నాన్న హనుమంతరావు వ్యాపారి. అమ్మ లావణ్య గృహిణి. శ్రీ చైతన్యలో అధ్యాపకులు బాగా సహకరించారు. ఎప్పుడు ఏ చిన్న సందేహం వచ్చినా పరిష్కారం చూపేవారు. గంటలు గంటలు చదివేవాడిని కాదు. చదివిన కొద్దిసేపైనా ఏకాగ్రతతో సాధన చేసేవాడిని. ఫిజిక్స్లో తొలుత కొంచెం వెనుకబడ్డాను. ఆ తర్వాత పుంజుకున్నా. టాప్ ఫైవ్ లో ఉంటానని ఊహించలేదు. ఢిల్లీ ఎయిమ్స్ లో చేరడమే నా  లక్ష్యం. కార్డియాలజిస్ట్ గా సేవలందిస్తా. ఉన్నత విద్యకోసం అమెరికా వెడతా.. తిరిగి ఇక్కడికి వచ్చి పేదలకు సేవ చేస్తాను అని ఎర్రబెల్లి సిద్ధార్థరావు అన్నారు.  

click me!