
ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నవీన్ను అతని స్నేహితుడు హరిహరకృష్ణ అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును విచారిస్తున్న పోలీసులు.. నవీన్ను హత్య చేయడానికి ముందు నిందితుడు హరిహరకృష్ణ మూసారాంబాగ్లోని ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్న తన అక్క, బావలను కలిశాడు. ఐదు వారాల క్రితమే నవీన్ను హత్య చేయాలని భావించిన హరిహరకృష్ణ.. తన ఉద్దేశాన్ని అక్క, బావలకు వివరించినట్టుగా తెలస్తోంది. అయితే హరిహరకృష్ణ అక్క, బావ ఇద్దరూ శారీరక వికలాంగులు.
ప్రస్తుతం నవీన్ హత్య కేసును విచారిస్తున్న పోలీసులు హరిహరకృష్ణ అక్క, బావలు ప్రస్తుతం ఎక్కడున్నారని గుర్తించే పనిలో ఉన్నారు. హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకున్న మొదటి రోజు పోలీసులు.. మూసారాంబాగ్లోని ఎస్బీఐ కాలనీలోని అతని అక్క నివాసం ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్లారు. అయితే వారు అక్కడ లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. గత రెండు రోజులుగా పోలీసులు.. వారి నివాసాన్ని సందర్శిస్తున్నప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. హరిహరకృష్ణ అక్క, బావలను విచారించిన తర్వాతే ఒక నిర్దారణకు వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వారి ఆచూకీని కనుగొనేందుకు.. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడంతో పాటుగా మొబైల్ జీపీఎస్ ట్రాక్ చేసి వారి జాడను కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఇక, హరిహరకృష్ణ, నవీన్లు ఇంటర్ చదువుతున్న సమయంలో స్నేహితులు. నిహారిక అనే అమ్మాయి విషయంలో వివాదం నేపథ్యంలో.. నవీన్ను హరిహరకృష్ణ ఫిబ్రవరి 17న అతిదారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు తనకేమి తెలియనట్టుగా నటించిన హరిహరకృష్ణ.. చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు హరిహరకృష్ణ ప్రియురాలు కె నిహారిక, స్నేహితుడు పి హసన్లను సోమవారం అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ శరీర భాగాలను పారవేయడంలో, హరిహరకృష్ణకు ఆశ్రయం కల్పించడంలో సహాయం చేసినందుకు హసన్ను, హత్య గురించి సమాచారం తెలిసినప్పటికీ దాచిపెట్టినందుకు నిహారికను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా మీడియాకు వెల్లడించారు.
ఫిబ్రవరి 17న అబ్దుల్లాపూర్మెట్లోని రమాదేవి స్కూల్ సమీపంలోని ఓ ఏకాంత ప్రదేశానికి నవీన్ను తీసుకెళ్లి హరిహరకృష్ణ అక్కడే అతి దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. తర్వాత నవీన్ తలను వేరు చేసి, గుండెను చీల్చివేసి, అతని ప్రైవేట్ భాగాలను నరికివేసినట్లు చెప్పారు. ‘‘నవీన్ మృతదేహాన్ని ముక్కలు చేసిన అనంతరం శరీర భాగాలను బ్యాక్ప్యాక్లో వేసుకుని బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడు. హత్య జరిగిన విషయాన్ని హసన్కి చెప్పి, శరీర భాగాలను పారవేయడంలో అతని సహాయం కోరాడు. హసన్, హరిహరకృష్ణ కలిసి మన్నెగూడలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి నవీన్ శరీర భాగాలతో ఉన్న బ్యాక్ప్యాక్ను పడేశారు. ఆ రాత్రంతా హాసన్ ఇంట్లోనే నిందితుడు హరిహరకృష్ణ ఉన్నాడు.
ఫిబ్రవరి 18న హస్తినాపురంలో నిహారికను కలుసుకున్న హరిహరకృష్ణ హత్య గురించి ఆమె తెలియజేశాడు. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం నిహారిక నుంచి రూ. 1500 నగదు తీసుకున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న నేరం చేసిన స్థలాన్ని నిహారికకు దూరం నుంచి చూపించాడు. నేరస్థలాన్ని చూసిన తర్వాత ఇద్దరూ కలిసి హోటల్లో భోజనం చేసారు. అయితే నవీన్ ఆచూకీ కోసం పదే పదే ఫోన్ కాల్స్ రావడంతో హరిహరకృష్ణ పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.
లొంగిపోయే ముందు సాక్ష్యాలను నాశనం చేయడానికి నవీన్ మృతదేహాన్ని తగులబెట్టాలని నిర్ణయించుకున్నాడు. మన్నెగూడలో పడేసిన శరీర భాగాలను అబ్దుల్లాపూర్మెట్ హత్య ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఇందుకు హసన్ అతనికి సహాయం చేశాడు. ఆ తర్వాత నిహారిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హరిహరకృష్ణ ఆమెఇంటికి వెళ్లి స్నానం చేశాడు. ఫిబ్రవరి 24న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితులు వారి కాల్ డేటాను తొలగించారు’’ అని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను హయత్ నగర్ కోర్టులో పోలీసులు హాజరుపరచగా.. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నిహారికను చంచల్గూడ జైలుకు, హాసన్ను చర్లపల్లి జైలుకు తరలించారు.