తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు అంతర్జాతీయ రోడ్డు రవాణా సమన్వయ కమిటీ కన్వీనర్ కేకే దివాకరన్, అన్ భజిగన్ తోపాటు పలువురు జాతీయ నేతలు సంఘీభావం ప్రకటించారు.
హైదరాబాద్ : ఈనెల 19న టీఎస్ఆర్టీసీ జేఏసీ, విపక్షాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కు జాతీయయూనియన్లు సైతం సంఘీభావం ప్రకటించాయి. జాతీయ యూనియన్లతోపాటు తెలంగాణ ఎంప్లాయిస్ అసోషియేషన్ సైతం సమ్మెకు, సమ్మెతోపాటు బంద్ కు కూడా సంఘీభావం ప్రకటించాయి.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు అంతర్జాతీయ రోడ్డు రవాణా సమన్వయ కమిటీ కన్వీనర్ కేకే దివాకరన్, అన్ భజిగన్ తోపాటు పలువురు జాతీయ నేతలు సంఘీభావం ప్రకటించారు.
బుధవారం హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేకే దివాకరన్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్దతిలో చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ప్రజల నుంచి మద్దతు ఉందని తెలిపారు.
ఈ నెల 19న తెలంగాణ బంద్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంద్తో కూడా ప్రభుత్వం స్పందించకుంటే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేకే దివాకరన్ కు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సమ్మెకు జాతీయ యూనియన్లు మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. 12వరోజు సమ్మె ఉధృతంగా సాగుతోందని కార్మికులు అధైర్యపడొద్దన్నారు. ప్రభుత్వం వేసే వలలో ఎవరు అధైర్యపడొద్దని అశ్వత్థామరెడ్డి సూచించారు.
మరోవైపు ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ లిబర్టీలోని టీఈఏ కార్యాలయంలో ఆర్జీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా పలువురు నేతలు సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆర్టీసీ జేఏసీ నేతల విజ్ఞప్తి మేరకు సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోషియేషన్ మద్దతు ఇస్తుందని అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి తెలిపారు. సమ్మెలో భాగంగా ఇద్దరు ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం తమను కలచివేసిందన్నారు.ఆత్మహత్యలతో కాకుండా పోరాటాలతో హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు.
ఇకపోతే ఆర్టీసీ సమ్మె 12వ రోజు ఉధృతంగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు. కొన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు గుండు గీయించుకుని నిరసన తెలిపారు.