క్యాన్సర్ రోగులకు చికిత్సే కాదు... మానసిక స్థైర్యం కూడా నింపుతున్నాం : నందమూరి బాలకృష్ణ

By Siva KodatiFirst Published Dec 31, 2022, 9:48 PM IST
Highlights

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డ్ లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 14 బెడ్స్‌ను ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. త్వరలో రేడియేషన్ యంత్రం , రెండవ పెట్ సిటీ స్కానింగ్ యంత్రాన్ని కూడా పేషెంట్లకు అందుబాటులోకి తీసుకొస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు 

క్యాన్సర్ రోగులకు భరోసా ఇవ్వడంతో పాటు వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నామన్నారు సినీనటుడు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ. శనివారం హాస్పటల్ లో ఉన్న ఎమర్జెన్సీ వార్డ్ లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 14 బెడ్స్‌ను ఆయన ప్రారంభించారు. గతంలో వున్న 7 పడకల స్థానంలో వీటిని ఏర్పాటు చేశారు. అనంతరం బాలయ్య మాట్లాడతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశించిన విధంగా పేద ప్రజలకు తక్కువ ధరలో అత్యాధునిక వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రేడియేషన్ యంత్రం , రెండవ పెట్ సిటీ స్కానింగ్ యంత్రాన్ని కూడా పేషెంట్లకు అందుబాటులోకి తీసుకొస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు. 

 

 

 

 

హాస్పిటల్ కు వచ్చే రోగులకు స్వాంతన కలిగించడానికి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.వాటికి గుర్తింపుగా సంస్థ ఎన్నో అవార్డులు అందుతున్నాయని బాలయ్య తెలిపారు.నానాటికీ పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారి నివారణకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక పరిశోధనా విభాగం కూడా ఏర్పాటు చేశామని బాలకృష్ణ చెప్పారు.  దీంతో పాటూ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలలో క్యాన్సర్ పై అవగాహన కలిగించడానికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు, స్క్రీనింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు.  ఈ సందర్భంగా హాస్పిటల్ అభివృద్దికి పాటుపడిన సిబ్బంది,యాజమాన్యంతో పాటూ నిధులు అందిస్తున్న పలువురు దాతలకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

 

అంతకు ముందు తెలుగు ప్రజలకు, అభిమానులకు బాలకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ ను కట్ చేశారు.వేడుకలలో భాగంగా సిబ్బంది నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను బాలయ్య వీక్షించారు.
 

click me!