Bigg Boss Telugu : పల్లవి ప్రశాంత్ బెయిల్ పరిస్థితేంటీ.. పోలీసుల అదుపులో మరో 16 మంది

By Siva KodatiFirst Published Dec 21, 2023, 8:05 PM IST
Highlights

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.  పల్లవి ప్రశాంత్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును నాంపల్లి కోర్ట్ రేపటికి వాయిదా వేసింది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ ఫైనల్ అనంతరం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన విధ్వంసం ఘటనలో అతనిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. పల్లవి ప్రశాంత్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును నాంపల్లి కోర్ట్ రేపటికి వాయిదా వేసింది. రైతుబిడ్డ తరపున న్యాయవాది జూలకంటి వేణుగోపాల్ వాదనలు వినిపించారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు జరిగాయని.. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత స్టూడియో బయట జరిగిన ఘటనలు ప్రశాంత్‌కు తెలియవని వేణుగోపాల్ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. 

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్‌కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో అతనిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు మైనర్లు వుండగా.. మిగిలిన 12 మందికి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. బిగ్‌బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం చోటు చేసుకున్న విధ్వంసానికి సంబంధించి వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఫైనల్ ముగిసిన తర్వాత విజయోత్సవాల్లో పాల్గొన్న ప్రశాంత్.. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ర్యాలీగా వెళ్లాడని, రోడ్డుపై వాహనాలు ఆపాడాని అభియోగాలు నమోదు చేశారు. అన్నపూర్ణ స్టూడియో మెయిన్ గేట్ నుంచి రావొద్దని చెప్పినా ప్రశాంత్ రావడం వల్లే అక్కడ పరిస్ధితి కంట్రోల్ తప్పిందని పోలీసులు వెల్లడించారు. 

Latest Videos

Also Read: Pallavi Prashanth Arrest: ప్లీజ్ నా తమ్ముడిని వదిలేయండి... చేతులు జోడించి వేడుకున్న అశ్వినిశ్రీ!

కాగా.. కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 ని ఉల్టా పల్టా అని ఏ ముహూర్తాన అన్నారో కానీ ప్రస్తుతం వివాదాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత కూడా ఆ వేడి తగ్గకపోగా కొత్త కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయి. రసవత్తరంగా సాగిన సీజన్ 7లో చివరకి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. బుల్లితెర నటుడు అమర్ దీప్ రన్నరప్ గా నిలవగా శివాజీ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన సంఘటనలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. హౌస్ లో జరిగిన సంఘటనలు కేవలం గేమ్ లో భాగం మాత్రమే. కానీ అభిమానులు ఆ గోడలని విడిచిపెట్టకుండా కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యేలా రచ్చ చేశారు. 

పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ ల కారు అద్దాలని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ రెచ్చిపోయి దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సుల్ని కూడా ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమర్ దీప్ కారులో తాన్ కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో అభిమానులు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. అమర్ దీప్ కుటుంబ సభ్యులని బూతులు తిట్టడం వరకు ఈ వివాదం వెళ్ళింది. ఫ్యాన్స్ చేసిన అతి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై అమర్ దీప్ మాట్లాడుతూ తనతో మాత్రమే గొడవ పెట్టుకోవాలంటే ఎంత దూరం అయినా వస్తానని.. కుటుంబ సభ్యులని లాగవద్దని చెప్పాడు. 
 

click me!