ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్శిటీలోని మానేరు హాస్టల్ లో మురళి అనే స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మురళి ఎమ్మెస్సీ ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మానేరు హాస్టల్ లోని రూమ్ నెంబర్ 159లో మురళి ఉంటున్నాడు. హాస్టల్ లోని బాత్రూములో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సహచర విద్యార్థులు చెబుతున్నారు. మురళి స్వగ్రామం సిద్ధిపేట ిల్లాలోని జైదేవ్ పూర్ మండలంలోని దౌలతాబాద్ గ్రామం అని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
అయితే మురళి ఆత్మహత్యపై పోలీసులు స్పందించారు. ఎలాంటి సూసైడ్ లెటర్ లభించలేదని హైదరాబాద్ ఇన్ ఛార్జి సిపి శ్రీనివాసరావు చెబుతున్నారు. సంఘటన తెలిసిన వెంటనే ఓయు విసి రామచంద్రన్, ఈస్ట్ జోన్ డిసిపి శశిధర్ రాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కోలువు రాదన్న మనస్థాపంతో ఆత్మహత్య : కోటూరి
ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ మురళి ఆత్మహత్యపై ఓయు జెఎసి నేత, నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ కోటూరి మానవత్ రాయ్ స్పందించారు. కెసిఆర్ ప్రభుత్వంలో కోలువులు రావని మనస్తాపము చెందిన మురళి ఆత్మబలిదానం చేసుకున్నాడని తెలిపారు. మురళి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మానవతారాయ్ డిమాండ్ చేశారు. పోలీసులు సూసైడ్ నోట్ మాయం చేశారని కోటూరి ఆరోపించారు. సిఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన విద్యార్థి ఉస్మానియాలో ఆత్మహత్య చేసుకోవడం కేసిఆర్ ప్రభుత్వానికి సిగ్గు చేటు అని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడడం లేదన్న బాధతోనే మురళి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.