
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఏసీబీకి పట్టించి, ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ భూకబ్జా బాగోతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా పూడురులోని సర్వే నెంబర్ 202లో తిప్పని నర్సింహులకు 3.10ఎకరాల భూమి ఉంది.
ఆ భూమికి సంబంధించి 2015లో స్టీఫెన్ సన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో 1.25 ఎకరాలు ఆయన కుమార్తె జెస్సికా పేరుతో రిజిస్టర్ చేయించారు. మిగతా భూమి నర్సింహులు పేరిటే ఉంది. అయితే ఆ భూమిని కూడా స్టీఫెన్ సన్ కు విక్రయించాలంటూ కొంతకాలంగా నర్సింహులుపై ఒత్తిడి పెరిగింది.
దీనికి నర్సింహులు అంగీకరించలేదు. ఈలోగా ఉపాధి కోసం నర్సింహులు హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 8న స్టీఫెన్సన్ మనుషులు తన భూమిని చదును చేసినట్లు తెలుసుకున్న నర్సింహులు.. ఊరికి తిరిగి వచ్చారు. ఈ నెల 9న చన్ గోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపిలో చేరిన ఈటల, ఏనుగు, తుల ఉమ...
తన భూమిని ఆక్రమించిన స్టీఫెన్ సన్ పైన అతని అనుచరులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తన ఫిర్యాదును బుట్టదాఖలు చేశారంటూ బాధితుడు ఆదివారం విలేకరుల ముందు వాపోయారు.
స్టీఫెన్సన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం మీద ఎస్సై శ్రీశైలాన్ని విలేకరులు ప్రశ్నించగా.. భూతగాదా విషయం తమ దృష్టికి వచ్చిందని ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వివరించారు.