కొద్దిసేపట్లో కుమార్తె పెళ్లి... ప్రమాదంలో తల్లి మృతి, నిజం దాచి

By Siva KodatiFirst Published Mar 1, 2019, 8:28 AM IST
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. తల్లి చనిపోయిన విషయాన్ని దాచి పెట్టి కూతురికి పెళ్లి చేశారు కుటుంబసభ్యులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. తల్లి చనిపోయిన విషయాన్ని దాచి పెట్టి కూతురికి పెళ్లి చేశారు కుటుంబసభ్యులు. వివరాల్లోకి వెళితే... అశ్వాపురం బుడుగు బజారుకు చెందిన కటుకూరి నాగేంద్ర కుమార్తె ప్రవీణకు, మొండికుంటకు చెందిన యువకునితో గురువారం తెల్లవారుజామున వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు.

ఈ క్రమంలో వధువు, బంధువుల బుధవారం రాత్రి 11.30 గంటలకు కార్లలో అశ్వాపురం నుంచి బయలుదేరి వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. వెనుక మరో కారులో వధువు ప్రవీణ తల్లి నాగేంద్ర మిగిలిన బంధువులతో కలిసి కారులో బయలుదేరారు.

అయితే వీరు ప్రయాణిస్తున్న కారు చింతిర్యాల అడ్డరోడ్డు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేంద్ర తీవ్రగాయాల పాలవ్వడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే నాగేంద్ర మరణించింది.

తల్లి మరణ వార్త తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని భయపడ్డ బంధువులు.... ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడి ప్రవీణ వివాహాన్ని జరిపించారు. అనంతరం నాగేంద్ర మరణవార్తను ప్రవీణకు చెప్పారు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచిన తన తల్లి... తన పెళ్లి చూడకుండానే మరణించడంతో ప్రవీణ కన్నీరుమున్నీరైంది. 
 

click me!