నీటి సంపులో పడ్డ కొడుకు.. కాపాడబోయి తల్లి.. ఇద్దరూ మృతి...

By AN TeluguFirst Published Jun 29, 2021, 9:50 AM IST
Highlights

నీటి సంపులో పడి తల్లి, కుమారుడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్, అమీన్ పూరలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హన్మకొండకు చెందిన దొడ్డా రాజేంద్రప్రసాద్ కు 2017లో సూర్యాపేటకు చెందిన శిరీష (30)తో వివాహం జరిగింది. 

నీటి సంపులో పడి తల్లి, కుమారుడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్, అమీన్ పూరలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హన్మకొండకు చెందిన దొడ్డా రాజేంద్రప్రసాద్ కు 2017లో సూర్యాపేటకు చెందిన శిరీష (30)తో వివాహం జరిగింది. 

వీరికి రెండున్నరేళ్ల కుమారుడు కార్తికేయ ఉన్నాడు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కావడంతో గత కొంతకాలంగా చందానగర్ లో నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం అమీన్ పూర్ పట్టణంలోని సృజన లక్ష్మీ కాలనీకి నివాసం మార్చారు. ఆదివారం రాత్రి 9 గంటలకు కుమారుడు కార్తికేయ ఇంట్లో ఆడుకుంటూ బయటకు వెళ్లి నీటి సంపులో పడిపోయాడు.

బాబు కనిపించకపోవడంతో భార్యభర్తలు బాబు కోసం వెతుకుతున్నారు. రాజేంద్రప్రసాద్ బైటికి వెళ్లి వెతుకుతుండగా, తల్లి శిరీష నీటి సంపులో పడిన బాబును కాపాడే క్రమంలో అందులో పడి మునిగిపోయింది. 

ఇంటికి వచ్చిన రాజేంద్రప్రసాద్ కు భార్య కూడా కనిపించకపోవడంతో సంపులో చూడగా భార్య శిరీష, కుమారుడు కార్తికేయ మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు, శిరీష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. 

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!