కోర్టులో వాంగ్మూలం ఇచ్చినరోజే... తల్లీ కూతుళ్ల దారుణ హత్య

By Arun Kumar PFirst Published Jun 19, 2021, 7:48 AM IST
Highlights

రాత్రి ఇంట్లో పడుకున్న తల్లీకూతుళ్లు తెల్లవారేసరికి శవాలుగా మారిన దుర్ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. 

మంచిర్యాల: తల్లీకూతుళ్లు అతి కిరాతకంగా హత్యకు గురయిన ఘోర సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఉదయం వీరి  మృతదేహాలను గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ జంట హత్యకు విషయం బయటపడింది. 

వివరాల్లోకి వెళితే... మంచిర్యాల పట్టణంలోని బృందావన్‌కాలనీలో విజయలక్ష్మి(47), కూతురు రవీనా(23)తో కలిసి నివాసం ఉంటోంది. సింగరేణిలో ఉద్యోగం చేసే విజయలక్ష్మి భర్త శంకర్ అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితమే మరణించాడు. 

అయితే హైదరాబాద్ లోని ఓ సాప్ట్ వేర్ కంపనీలో రవీనా ఉద్యోగం చేస్తోంది. ఈమెకు సోషల్ మీడియాలో బోధన్ కు చెందిన అరుణ్ కుమార్ పరిచయమయ్యాడు. వీరి పరిచయం కాస్తా ప్రేమ పెళ్లికి దారితీసింది.  కానీ పెళ్లయిన కొన్నాళ్ళకే భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు. దీంతో రవీనా తల్లివద్దే వుంటోంది. 

read more  జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

భార్యకు దూరమైన అరుణ్ ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో రవీనాపైనే కాదు ఆమె తల్లి విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టాడు. వీటిని గుర్తించిన తల్లీకూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరుణ్ పై కేసు నమోదయ్యింది.  ఈ క్రమంలోనే గురువారం వాంగ్మూలం ఇచ్చేందుకు ఇద్దరూ చెన్నూరు కోర్టుకు వెళ్లివచ్చారు. ఇదే రోజు రాత్రి వీరిద్దరు హత్యకు గురవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

తల్లీకూతుళ్ల హత్యలపై సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏసీపీ అఖిల్‌ మహాజన్, సీఐ లింగయ్యతో పాటు ఇతర సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంతో సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. 
 

click me!