మోదీ ఖాళీ చేతులతో తెలంగాణకు వచ్చారు.. వాటికి సమాధానం చెప్పలేదు: ఎమ్మెల్సీ కవిత

By Sumanth KanukulaFirst Published Nov 12, 2022, 4:00 PM IST
Highlights

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రధాని మోదీ ఖాళీ చేతులతో తెలంగాణకు వచ్చారని విమర్శించారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రధాని మోదీ ఖాళీ చేతులతో తెలంగాణకు వచ్చారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదని అన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మోదీ తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఒట్టి మాటలు చెప్పేవాళ్లు ఎవరో.. అభివృద్ది చేసేవాళ్లు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని ప్రజలను కోరారు. మొహం చాటేసే పార్టీలు ఏవో ప్రజలు గుర్తించాలని కోరారు.  

ఇక, శనివారం(నవంబర్ 12) తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద బీజేపీ స్వాగత సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ పేరు చెప్పి పార్టీలు పెట్టినవారు పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారని.. ఒక్క అసెంబ్లీ సీటు తెలంగాణ సర్కార్ మొత్తం మునుగోడుకు పోయిందన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎంత గట్టిగా పోరాడారో.. మునుగోడు ఉపఎన్నికను చూస్తే అర్థమవుతోందన్నారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలుచాటి చెప్పారని అన్నారు. తెలంగాణ కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. 

ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయని  విమర్శించారు. ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని అంధవిశ్వాస శక్తులు పాలిస్తున్నాయని అన్నారు. ఎర్రజెండా నేతలు అభివృద్ది, సామాజిక న్యాయానికి వ్యతిరేకులని విమర్శించారు. అభివృద్ది వ్యతిరేకులతో ఇక్కడి సర్కార్ జత కట్టిందని విమర్శించారు. తెలంగాణలో మూఢనమ్మకాలతో ఏం జరుగుతుందో దేశప్రజలకు తెలియాలని అన్నారు. కేబినెట్‌లో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీసేయాలనేది మూఢనమ్మకాలు నిర్ణయిస్తున్నాయని విమర్శించారు. ఫ్యామిలీ ఫష్ట్ కాదు.. పీపుల్ ఫస్ట్ అనేది బీజేపీ నినాదమని చెప్పారు. తెలంగాణలో అవినీతిరహిత పాలన అందించేందుకు బీజేపీ సిద్దంగా ఉందని చెప్పారు. ప్రజలను లూటీ చేసే ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలిపారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

click me!