మనలో చాలా మంది జంతువులను పెంచుకుంటూ ఉంటారు. కొందరు కుక్కలు, పిల్లులు పెంచుకుంటే, కొందరు పక్షులు పెంచుకుంటూ ఉంటారు. నగరానికి చెందిన ఓ వ్యాపారి కూడా ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే, సడెన్ గా ఆ చిలుక కనిపించకుండా పోయింది. వెంటనే, అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఫిర్యాదు ప్రకారం, వెంటనే యాక్షన్ లోకి దిగిన పోలీసులు ఆ చిలుకను వెతికి తీసుకువచ్చారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, నరేంద్రచారి మైరు అనే వ్యాపారి జూబ్లిహిల్స్ రోడ్ నెం.44లో నివసిస్తున్నాడు. ఆయనకు బిస్ట్రో కాఫీ షాపు ఉంది. దానిని ఆయన నిర్వహిస్తున్నారు. కొంత కాలం క్రితం ఆయన ఆస్ట్రేలియాకు చెందిన రాక్టో అనే చిలుకను కొనుగోలు చేశాడు. దాని వయసు 4 నెలలు కాగా, దాని ఖరీదు రూ.1.30లక్షలు కావడం గమనార్హం. అంత ఖరీదైన చిలుకను ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకునేవాడు.
సడెన్ గా అంటే సెప్టెంబర్ 22వ తేదీనన చిలుకకు ఆహారం పెట్టేందుకు పంజరం తలుపు తెరవగా, అది ఒక్కసారిగా ఎగిరిపోయింది. దాని కోసం చాలా సేపు గాలించాడు. అయినా, జాడ దొరకలేదు. దీంతో, సెప్టెబర్ 24వ తేదీన పోలీసులు ఫిర్యాదు చేశాడు. చిలుక ఫోటోని కూడా వారికి చూపించాడు. దీంతో, ఖరీదైన చిలుక కావడంతో పోలీసులు కూడా వెంటనే దానిని వెతికే పనిలో పడ్డారు.
చిలుకలు, ముఖ్యంగా జంతువులు అమ్మేవారి పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఈ చిలుకను వాట్సాప్ లో అమ్మకానికి పెట్టాడు. ఈ విషయం తెలియడంతో, పోలీసులు వారి నుంచి చిలుకను స్వాధీన పరుచుకున్నారు. అప్పటికే, ఈ చిలుక ఇద్దరి చేతులు మారిందట. మూడోమారు ముజీబ్ అనే వ్యక్తి రూ.70 వేలకు చిలుకను అమ్మకానికి పెట్టినప్పుడు, విషయం పోలీసులకు తెలిసింది. కేవలం ఫిర్యాదు చేసిన ఒక్కరోజులో చిలుక ఆచూకీ కనుగొని, యజమానికి అప్పగించారు.