జీహెచ్ఎంసీ ఎన్నికలు: మంత్రులు, నేతల లాబీయింగ్‌.. కేటీఆర్‌కు తలనొప్పులు

By Siva KodatiFirst Published Nov 18, 2020, 2:33 PM IST
Highlights

మిని అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. మేయర్ సాధారణ మహిళా రిజర్వేషన్ కావడంతో మహిళా మణులు తెరపైకి వచ్చారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, కీలకనేతలు తమ కోడళ్లను, భార్యలను రంగంలోకి దించారు. 

మిని అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. మేయర్ సాధారణ మహిళా రిజర్వేషన్ కావడంతో మహిళా మణులు తెరపైకి వచ్చారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, కీలకనేతలు తమ కోడళ్లను, భార్యలను రంగంలోకి దించారు.

మేయర్ అభ్యర్ధి కోసం తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి.

మంత్రి తలసాని తన కోడలు మహితను రంగంలోకి దింపారు. మేయర్ రేసులో నిలబెట్టేందుకు గాను కార్పోరేటర్ టికెట్‌ను ఆశిస్తున్నారు. తలసాని కంటే ఒక అడుగు ముందుకేసిన మేయర్ రామ్మోహన్.. తన భార్య శ్రీదేవిని రంగంలోకి దింపారు.

మరోవైపు డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోడలు శిల్పా రామేశ్వరినీ మేయర్ రేసులో నిలబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కూడా కోడలు ప్రీతిరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు లాబీయింగ్ పెద్ద ఎత్తున చేస్తున్నట్లు తెలిసింది.

ఖైరతాబాద్ కార్పోరేటర్ పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా మేయర్ పదవి కోసం ఈసారి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు సైతం తన కుమార్తెను ఈసారి గ్రేటర్ బరిలో దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా మేయర్ అభ్యర్ధి విషయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పార్టీలోని ముఖ్యనేతలు, మంత్రులు.. కూతుళ్లు, కోడళ్లకు టికెట్లు ఇప్పించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

గ్రేటర్ ఎన్నికలను భుజానికెత్తుకున్న మంత్రి కేటీఆర్‌కు సహకరించేందుకు ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగారు. మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న ముఖ్య నేతలంతా కవితను కలిసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మేయర్ మహిళ కావడంతో ఇప్పటి వరకు రాజకీయ అరంగేట్రం చేయని మహిళా మణులు గ్రేటర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

click me!