బీఆర్ఎస్ సభతో బండి సంజయ్‌కి మైండ్ బ్లాంక్.. కేసీఆర్ , కేటీఆర్‌లను విమర్శించడమే పని : ప్రశాంత్ రెడ్డి

By Siva KodatiFirst Published Jan 19, 2023, 4:46 PM IST
Highlights

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఫెయిల్ అయ్యిందంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ , కేటీఆర్‌లను విమర్శించడమే సంజయ్ పనిగా పెట్టుకున్నారని మంత్రి దుయ్యబట్టారు. 

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఫెయిల్ అయ్యిందంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి బండి సంజయ్‌కి మతి భ్రమించిందన్నారు. ఆయన మాటల్లో అర్ధం పర్థం లేదని, కేసీఆర్ , కేటీఆర్‌లను విమర్శించడమే సంజయ్ పనిగా పెట్టుకున్నారని మంత్రి దుయ్యబట్టారు. ప్రజల కోసం సంజయ్ ఏం చేశారని నిలదీశారు. ప్రధాని మోడీ 8 ఏళ్లలో ఏం చేశారు, త్వరలో ఏం చేయబోతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. తాను ఇంత పెద్ద సభ చూడలేదని అఖిలేష్ యాదవ్ అన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. బండి సంజయ్‌కి అది కనిపించకపోవడం దురదృష్టకరమని ప్రశాంత్ రెడ్డి చురకలంటించారు. బీఆర్ఎస్ సభ ఎక్కడ జరిగినా రెస్పాన్స్ ఇలాగే వుంటుందని మంత్రి పేర్కొన్నారు. 

అంతకుముందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ ఫ్లాప్ అయ్యిందంటున్న బండి సంజయ్.. కంటి వెలుగు పథకంలో కళ్ల పరీక్ష చేయించుకోవాలంటూ మంత్రి చురకలంటించారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి కేసీఆర్ సుపారీ తీసుకున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ కౌంటరిచ్చారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రత్యేకంగా సుపారీలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. వాళ్ల నేతలే చాలంటూ సెటైర్లు వేశారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సూపర్‌ హిట్ అయ్యిందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర జాతీయ నేతలు దేశానికి దిశానిర్దేశం చేశారని పువ్వాడ అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

ALso REad: జై తెలంగాణ అని ఎందుకు అనలేదు: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

ఇకపోతే.. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పాలసీ ఏంటీ, వైఖరి ఏంటనే దానిపై వివరంగా చెబుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో 1.40 లక్షల టీఎంసీల వర్షపాతం నమోదవుతోందన్నారు. ప్రపంచానికే ఫుడ్ చైన్ అందించిన దేశం ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు తింటుందోని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

సహజ సంపద మన దేశ ప్రజల సొత్తుని.. అమెరికా మనకంటే రెండు రెట్లు పెద్దదని, కానీ వారి వ్యవసాయం 29 శాతం మాత్రమేనని సీఎం పేర్కొన్నారు. లక్షల కోట్ల సంపద ఎవరి సొంతమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇండియాలో మామిడి కాయలే కాదు, యాపిల్ కాయలు పండుతాయని కేసీఆర్ తెలిపారు. భారతదేశం అన్ని విధాలా సుసంపన్నమైన దేశమని.. జలవనరులు, సాగు భూమి విషయంలో మనదేశమే అగ్రగామన్నారు. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో వున్నాయని.. కానీ కేవలం 20 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్‌పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని.. తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. నష్టాలు సమాజానికి, లాభాలు ప్రైవేట్ వ్యక్తులకా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎల్ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా.. ఎల్ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు బీఆర్ఎస్‌ను బలపరచాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కరెంట్ కార్మికులారా..? పిడికిలి బిగించండి అంటూ కేసీఆర్ కోరారు.

click me!