రిపబ్లిక్ డే వేడుకల వివాదం.. కేసీఆర్ చెబితేనే రాజ్‌భవన్‌కి : మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 25, 2023, 5:12 PM IST
Highlights

తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. గవర్నర్ రోల్ ఏంటో, సీఎం పాత్ర ఏంటో తమకు తెలుసునని మంత్రి అన్నారు. ఏ వేడుకలైనా నిబంధనల ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. 

రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి తెలంగాణలో గవర్నర్ వర్సెస్ సీఎంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం చివరికి హైకోర్టు మెట్లెక్కడం.. న్యాయస్థానం సైతం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చెబితేనే తామంతా రాజ్‌భవన్‌లో వేడుకలకు హాజరవుతామన్నారు. ప్రొసీజర్ ప్రకారమే రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని మంత్రి తెలిపారు. రాజ్‌భవన్‌లో జెండా ఎగురవేయొద్దని తాము గవర్నర్‌కు చెప్పామా అని తలసాని ప్రశ్నించారు. 

వేడుకల నిర్వహణకు సంబంధించి సీఎస్ అన్ని ఏర్పాట్లు చేస్తారని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గవర్నర్ రోల్ ఏంటో, సీఎం పాత్ర ఏంటో తమకు తెలుసునని మంత్రి అన్నారు. గవర్నర్ కంటి వెలుగు కార్యక్రమానికి వస్తానంటే తాము ఆపలేదని తలసాని గుర్తుచేశారు. ఏ వేడుకలైనా నిబంధనల ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు సచివాలయం ప్రారంభిస్తే తప్పేమిటని తలసాని ప్రశ్నించారు. మోడీ పుట్టిన రోజు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా కడితే దాన్ని ప్రారంభించుకోవచ్చునని.. బండి సంజయ్ మోడీకి ఆ సలహా ఇచ్చుకోవచ్చని శ్రీనివాస్ యాదవ్ చురకలంటించారు. ప్రతి దాన్ని వివాదం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని తలసాని ఎద్దేవా చేశారు. 

ALso REad: రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

కాగా... తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించాలని హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే  వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ శ్రీనివాస్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం  హైకోర్టు విచారణ నిర్వహించింది. ఐదు లక్షలతో సభ నిర్వహించడానికి  కరోనా నిబంధనలు  ఏమయ్యాయని  పిటిషనర్ తరపు  న్యాయవాది ప్రశ్నించారు. ఈ ఏడాది రాజ్ భవన్ లో నే  రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నట్టుగా  ఏజీ చెప్పారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన  సర్క్కులర్ ను రాష్ట్ర ప్రభుత్వం  ధిక్కరించిందని  పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో  రిపబ్లిక్ డే ఉత్సవాలను  పరిమితమైన సంఖ్యలో  ఆహ్వానితుల మధ్య నిర్వహించిన  విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు. అయితే కరోనా నిబంధనలు ప్రస్తుతం లేవని ఆయన  వాదించారు. రాజ్ భవన్ లో  రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించడాన్ని రాజకీయం చేయడం తగదని  అడ్వకేట్ జనరల్ కోరారు. పరేడ్  ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించుకోవాలని హైకోర్టు  ప్రభుత్వానికి సూచించింది. రిపబ్లిక్ డే  నిర్వహణ విషయమై కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్ ను  పాటించాలని ప్రభుత్వాన్ని  హైకోర్టు కోరింది.   

ALso REad: గణతంత్ర వేడుకలు: కెసిఆర్ కు హైకోర్టు షాక్, తమిళిసైకి ఊరట

దేశంలోని అన్ని రాష్ట్రాలు  గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం  ఈ నెల  19 తేదీల్లో  సర్క్యులర్  జారీ చేసింది. అయితే రిపబ్లిక్ డే  ఉత్సవాలను  రాజ్ భవన్ లో నిర్వహించాలని ఈ నెల  18న తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. గత ఏడాది కూడా గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించారు.  

click me!