
క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. చీకోటి ప్రవీణ్ నిర్వహిస్తున్న క్యాసినో పేరుతో హవాలా లావాదేవీలు జరిపిన ఆరోపణల కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని విచారించిన సంగతి తెలిసిందే. తాజా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే హరీష్ బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడీ ఎదుట విచారణకు హజరైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు నేడు మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మరికొందరు వ్యాపారవేత్తలను కూడా ఈడీ అధికారులు విచారించనున్నట్టుగా తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు.. ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా నగదు చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. విచారణకు పిలుస్తున్న వారి బ్యాంక్ స్టేట్మెంట్లపై దృష్టి సారిస్తున్నారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్, అతని సన్నిహితులను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఇటీవల మంత్రి తలసాని మహేష్, తలసాని ధర్మేంద్ర యాదవ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డిని ఈడీ ప్రశ్నించారు. అయితే ఈడీ విచారణకు హాజరైన సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఎల్ రమణ.. ఆస్పత్రిలో చేరారు.