
తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కొంతమంది కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు. బీజేపీ నాయకులు పదవుల కోసం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, అసాంఘిక చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా సీఎం కేసీఆర్ సుపరిపాలన అందించారని, కానీ.. బీజేపీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతుందనీ, అధికారం కోసం కుట్రలకు పాల్పడడం దారుణమని అన్నారు. ఇలాంటి కుట్రలపైన ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని అన్నారు.ఈ విషయాన్ని మేధావులు గమనించాలని అన్నారు.
పాఠశాల స్థాయిలోనే విద్యార్ధులకు దేశ స్వాతంత్య్ర చరిత్రను తెలియజేసేందుకు గాంధీచిత్ర ఉచిత ప్రదర్శనను చేపట్టి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి తలసాని తెలిపారు. 15 రోజుల పాటు జరిగిన ప్రదర్శనలో 22.50 లక్షల మంది విద్యార్థులు 562 థియేటర్లలో చిత్రాన్ని తిలకించారని చెప్పారు. చిత్ర ప్రదర్శనకు సహకరించిన రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి మండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్నారంగ్, అనుపమ్రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బసిరెడ్డి, దామోదర్ ప్రసాద్, క్యూబ్, యూఎఫ్వో, పీఎస్డీ డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను మంత్రి తన కార్యాలయంలో సత్కరించారు. కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాల సంచాలకుడు రాజమౌళి, ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం తదితరులు పాల్గొన్నారు.
ఇదిలాఉంటే..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలపాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని 552 స్క్రీన్స్లో ప్రదర్శించామని, రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల 57 వేల మంది విద్యార్థులు ఈ చిత్రాన్ని చూశారని వెల్లడించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందింపజేయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి సహకరించిన తెలంగాణ, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డిజిటల్ సర్వీసెస్ ప్రతినిధులను సీఎస్ సోమేష్ కుమార్తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా సన్మానించారు.