
తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. మంగళవారం తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకేసారి 51 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కేటీఆర్ ప్రారంభించారు. చిన్నారుల కోసం బొమ్మలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న టాయ్స్ పార్క్కు శంకుస్థాపన చేశారు.
రూ.156 కోట్లతో 106 ఎకరాల స్థలంలో ఈ పార్క్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల కోసం కాకుండా రేపటి తరం కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని.. ఇక్కడి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా అందుబాటులోకి వస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
ALso Read: హైదరాబాద్ బాగుపడాలంటే పౌరుల భాగస్వామ్యం కావాలి.. మంత్రి కేటీఆర్
అంతకుముందు సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ 10వ వసంతంలోకి అడుగుపెడుతుందని.. సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ నివేదికలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి విడుదల చేసిన తాజా బుక్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నగరంగా ఉందని పలు నివేదికలు వెల్లడించాయని అన్నారు. అయితే ప్రపంచంతో పోల్చితే విశ్వనగరం కావాలంటే చాలా మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉందని చెప్పారు. మాన్సూన్కు సంబంధించి చాలా పనులను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
నాలాలను క్లీనింగ్ చేసేటప్పుడు.. కొన్ని వస్తువులను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని కామెంట్స్ చేశారు. సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయో లేదో కానీ నాలాలో అన్ని దొరుకుతున్నాయని అన్నారు. ఇల్లు మాత్రమే నాది.. నాలా నాది కాదు అనే భావనతో బతకొద్దు అని అన్నారు. ప్రజల్లో మార్పు రాకపోతే ఎంతగా ప్రయత్నించినా, ఎంత డబ్బు ఖర్చు చేసిన ఫలితం ఉండదని అన్నారు. నగరం బాగుపడాలంటే పౌరుల భాగస్వామ్యం తప్పకుండా అవసరం అని కేటీఆర్ స్పష్టం చేశారు.