
ఐటీ పార్క్తో కండ్లకోయ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలో ఐటీ పార్కుకు కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. మొత్తం 10 ఎకరాల స్థలంలో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో ఈ ఐటీ పార్కును నిర్మించనున్నారు. ఈ ఐటీ పార్కులో 100 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. కండ్లకోయ ఐటీ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తో పాటుగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఐటీ కంపెనీల చుట్టూ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న భయాందోళనలు ఉన్నప్పటికీ ప్రస్తుతం గూగుల్, అమెజాన్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రముఖ కంపెనీలు తమ క్యాంపస్లను ఇక్కడే ఏర్పాటు చేశాయన్నారు. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో నెలకొల్పిందన్నారు. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం తెలంగాణలో ఉంది. దీన్ని మూడున్నరేండ్లలోనే పూర్తి చేశారని తెలిపారు. కాళేశ్వరం నుంచి గజ్వేల్కు నీళ్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కు మాత్రమే దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ జీవితం, రాజకీయాల్లో చేస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగాలు సాధించేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని యువత పెంపొందించుకోవాలని, జీవితంలో అడ్డంకులు వచ్చినా నిరాశ చెందవద్దని కోరారు. తుది వరకు పట్టుదలతో పోరాడితేనే విజయం లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్.. రాజకీయాల్లో వచ్చాక ఎమ్మెల్యేగా తొలి ఎన్నికలో ఓడిపోయారని గురయ్యారు. అయితే ప్రజా సేవ లక్ష్యంగా కేసీఆర్ రాజకీయాల్లో ముందుకు సాగారే కానీ నిరుత్సాహపడకూడదన్నారు.
ఒకవేళ కేసీఆర్ రాజకీయాలను వీడి ఉంటే ఇవాళ తెలంగాణ సాధించి ఉండేవాళ్లమా? ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కేసీఆర్ పోరాటాన్ని వీడలేదని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ కోసం 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు ఆయన వద్ద ఏం లేదని కేటీఆర్ అన్నారు. 14 ఏళ్లు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణను సాధించారని తెలిపారు. ఆ ఫలితంగానే ఇవాళ కండ్లకోయలో ఐటీ పార్కును నిర్మించుకోబోతున్నామని అన్నారు.