ఏడాదిన్నరలో నల్గొండలో ఐటీ హబ్ ప్రారంభిస్తాం.. 65 ఏళ్ల దరిద్రాన్ని ఆరేళ్లలో తరిమికొట్టాం: మంత్రి కేటీఆర్

Published : Dec 31, 2021, 04:01 PM IST
ఏడాదిన్నరలో నల్గొండలో ఐటీ హబ్ ప్రారంభిస్తాం.. 65 ఏళ్ల దరిద్రాన్ని ఆరేళ్లలో తరిమికొట్టాం: మంత్రి కేటీఆర్

సారాంశం

ఏడాదిన్నరలో నల్గొండ ఐటీ హబ్‌ను (Nalgonda IT Hub)  ప్రారంభించి.. స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ది జరుగుతుందని చెప్పారు. క్షేమం, అభివృద్ది జోడెద్దుల మాదిరిగా నడుస్తున్నాయని అన్నారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమ్మిళిత అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా తెలంగాణ రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో నల్గొండ ఐటీ హబ్‌ను (Nalgonda IT Hub)  ప్రారంభించి.. స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని కేటీఆర్ అన్నారు.  నల్గొండ ఐటీ హబ్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు తొమ్మిది కంపెనీలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోగా.. మరో ఏడు కంపెనీలు ఐటీ హబ్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో ఐటీ హబ్​కు కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటుగా మంత్రులు జగదీశ్​ రెడ్డి, ప్రశాంత్​ రెడ్డి‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ హబ్‌లు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. నిజామాబాద్‌లో ఉగాదిలోపు ప్రారంభం కానుందని.. అతి త్వరలో మహబూబ్‌నగర్‌లో కూడా ఐటీ హబ్ ప్రారంభించనున్నట్టుగా చెప్పారు. నల్గొండలో కూడా రానున్న 16 నుంచి 18 నెల్లలో ఐటీ హబ్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. ఐటీ హబ్ ద్వారా 1600 ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని వివరించారు. కొత్తగా నల్గొండలోని పేదల కోసం ఐదు బస్తీ దవాఖానాలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. వెజ్- నాన్ వెజ్ సమీకృత మార్కెట్‌కు నాలుగున్నర కోట్లతో ఈరోజే శంకుస్థాప చేస్తున్నామని తెలిపారు. రూ. మూడు కోట్లతో ఆధునికమైన రెండు వైకుంఠదామాలకు ఏర్పాటు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. 

నల్గొండ అభివృద్ది పనుల కోసం ప్రభుత్వం రూ. 100 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చిందని.. అందులో రూ.30 కోట్లు విడుదల చేసిందని, మిగిలిన రూ.70 కోట్లు కూడా త్వరలో విడుదల చేస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ బౌగోళికంగా చూస్తే 11వ పెద్ద రాష్ట్రం, జనాభాపరంగా చూస్తే 12వ పెద్ద రాష్ట్రం.. కానీ భారత ఆర్థిక వ్యవస్థకు 4వ అతిపెద్ద చోదకశక్తి గా తెలంగాణ ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక చెప్పిందన్నారు. రాబోయే ఏడాది కాలంలో నల్గొండ రూపురేఖలు మారాలని అధికారులను ఆదేశించారు. 

Telanganaలో జరుగుతున్న అభివృద్ది దేశంలో ఎక్కడ జరగడం లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సమ్మిళిత అభివృద్ది కొనసాగుతుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ది జోడెద్దుల మాదిరిగా నడుస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాకముందు కనీసం కరెంట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. నల్గొండలో ప్లోరోసిస్ అనే దరిద్రాన్ని పెంచారని మండిపడ్డారు. 65 ఏళ్లలో జిల్లాలో పరిష్కారం కానీ ఫ్లోరోసిస్ సమస్యను.. తాము కేవలం ఆరేళ్లలోనే నల్గొండలో ఫ్లోరోసిస్ తరిమికొట్టామని కేటీఆర్ అన్నారు. ఆరేళ్లలో నల్గొండకు మూడు మెడికల్ కాలేజ్‌లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. రూ. 1800 కోట్ల ఖర్చు పెట్టి యాద్రాద్రి ఆలయాన్ని భారతదేశం అబ్బురపడే విధంగా తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu