
తెలంగాణలో మూతపడ్డ ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి తెరవాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు మంత్రి కేటీఆర్. ఎంతో చరిత్ర వున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ విషయాన్ని శాసనసభలో వెల్లడించారని మంత్రి గుర్తుచేశారు. షుగర్ ఫ్యాక్టరీల పనితీరును అధ్యయనం చేసేందుకు నాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మహారాష్ట్రలో పర్యటించిందన్నారు.
అక్కడి రైతులు చేస్తున్న విధంగానే సహకార రంగంలో చక్కెర కార్మగారాలను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే సిర్పూర్ పేపర్ మిల్లును పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు. కాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేయాన్స్ ఫ్యాక్టరీని కూడా పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. కేంద్రం మాదిరిగా ఈ ఫ్యాక్టరీలను రాష్ట్రం విక్రయించుకోవచ్చునని.. కానీ కేసీఆర్ ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని మంత్రి పేర్కొన్నారు. అవి ప్రభుత్వానికి ఆదాయ వనరులుగానే తాము చూస్తున్నామని కేటీఆర్ చెప్పారు.
అంతకుముందు మంగళవారం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని అధికార మోదీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నష్టాలను అందరికీ పంచి.. లాభాలను కొందరికి అంకితం చేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమనేది తెలంగాణ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో వివరంగా తెలియజేశారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పరంగా కూడా కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేశారు. రైతు బీమాను ప్రవేశపెట్టినప్పుడు ప్రైవేట్ సంస్థలు ఉన్నప్పటికీ.. ఎల్ఐసీ అప్పగించారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేయడాన్ని మాటల్లోనే కాకుండా.. చేతల్లో చూపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటును పరిశీలిస్తామని విభజన చట్టంలోనే ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు పెడతామని కేంద్రం చెప్పిందని తెలిపారు. 2014 నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతూనే ఉన్నామనిచెప్పారు. కేంద్ర మంత్రులను కలిసిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. తాను స్వయంగా ప్రధానిని కలిశానని చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ పెడితే 15 నుంచి 20 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపానని అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ బయ్యారానికి సరఫరా చేస్తే బాగుంటుందని చెప్పానని తెలిపారు.