మునుగోడు ఉపఎన్నికపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ : సీపీఐ, సీపీఎం నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ

By Siva KodatiFirst Published Oct 6, 2022, 4:23 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు. ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై సమీక్షా సమావేశం నిర్వహించామని... మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించుకున్నట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. 

మునుగోడు ఉపఎన్నికపై అధికార టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దీనిలో భాగంగా గురువారం సీపీఐ, సీపీఎం నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు నల్గొండ జిల్లా వామపక్షాల ముఖ్య నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో మంత్రి జగదీశ్ రెడ్డి చర్చించారు. మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాలతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు... రేపటి నుంచి 14 వరకు మునుగోడులో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈలోగా అభ్యర్థి ప్రకటన, నామినేషన్ దాఖలుపై ఆలోచనా ధోరణిలో గులాబీ బాస్ ఉన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారా? లేక బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికలకు పోతారా? అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉంది. తెలంగాణ సెంటిమెంట్ పదం లేకుండా.. బీఆర్ఎస్ పేరుతో నామినేషన్ వేస్తే ఎలా అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉంది. 

ALso REad:మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతోనే బరిలోకి.. అప్పటివరకు అదే పేరు: క్లారిటీ ఇచ్చిన వినోద్ కుమార్..!

దీంతో టిఆర్ఎస్ పేరుతోనే నామినేషన్లు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.మరోవైపు మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించింది. ప్రతి యూనిట్ కు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. 14 మంది మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 54 మంది ఎమ్మెల్యేలను ఇన్చార్జిగా నియమించింది. ఏడుగురు ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ లకు పూర్తి బాధ్యత అప్పగించింది. 

ప్రతి ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యే, మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ఒక్కో ఎమ్మెల్యేకు 800 నుంచి 1200 మంది ఓటర్లు ఉన్నారు. మంత్రులకు అత్యధికంగా మూడువేల ఓటర్ల బాధ్యతలు అప్పగించారు. ప్రచారం చివరి రోజు వరకు నియోజకవర్గంలోనే ఉండాలని కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలు చర్చించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.
 

click me!