కేసీఆర్ పక్కనే వుంటూ... సీఎం కుర్చీ కోసం ఈటల కుట్రలు: మంత్రి గంగుల సంచలనం

By Arun Kumar PFirst Published Jun 14, 2021, 4:57 PM IST
Highlights

ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం కేసీఆర్ కే వెన్నుపోటు పొడవాలని చూశాడని మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జమ్మికుంట: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రేమతో తమ్మీ అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటే... ఈటల రాజేందర్ మాత్రం ఆయనకు వెన్నుపోటు పొడవాలని చూశాడని మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పక్కనే వుంటూ ఏకంగా సీఎం కుర్చీకే ఈటల ఎసరు పెట్టడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. కేసీఆర్ అంటే ఓ వ్యక్తి కాదు ఒక శక్తి అని రాజేందర్ గుర్తించాలని... ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సర్కార్‌ను విమర్శించడం ఈటలకు తగదని గంగుల అన్నారు. 

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్స్‌‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే ఆరూర్ రమేష్‌‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈటల రాజేందర్ పై విరుచుకుపడ్డారు. 

ఇంతకుముందు కూడా ఈటల టీఆర్ఎస్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేశారని గంగుల ఆరోపించారు. తనకు ఈటల రాజేందర్ మీద వ్యక్తిగతంగా కోపం లేదన్నారు. ఎదుటి వాళ్లు సంబరపడితే ఈర్ష్యపడే వ్యక్తి ఈటల అని గంగుల అన్నారు. 

read more  ఫోకస్ హుజురాబాద్... ఆఘమేఘాల మీద ప్రజలకు సంక్షేమ పథకాలు

 ఆత్మగౌరవం ఉంటే నల్లచట్టాలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని ఆయన ఈటలకు సూచించారు. హుజూరాబాద్ అభివృద్ది కావాలంటే టీఆర్ఎస్ మరోసారి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ బొమ్మతోనే ఈటల రాజేందర్ గెలిచారని ఆయన గుర్తు చేశారు. 

హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ ఈ నెల 12న రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ స్థానం ఖాళీ అయినట్టుగా స్పీకర్ కార్యాలయం ఈసీకి సమాచారం పంపింది. ఈ క్రమంలోనే ఇవాళ(సోమవారం) ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు.

click me!