
Minister Allola Indrakaran Reddy: ఆదివాసీ గిరిజనుల చిరకాల డిమాండ్ను నెరవేరుస్తూ రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు (కేసీఆర్) శుక్రవారం ప్రారంభించారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 12 మంది ఆదివాసీ లబ్ధిదారులకు పత్రాలు అందజేసి కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. 26 జిల్లాల పరిధిలోని 1.5 లక్షల మంది రైతులకు 4.06 లక్షల ఎకరాల పోడు భూములను పంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు వివిధ జిల్లాల్లో ఏకకాలంలో ప్రారంభించారు. మహిళా లబ్ధిదారుల పేరుతో భూమి పట్టాలు ఇస్తున్నారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కరోజే 47 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లాలో రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారనీ, జల్ జంగల్ జమీన్ స్పూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. బుధవారం కుబీర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 4,05,601 ఎకరాలకు చెందిన 1.51 లక్షల మంది అడవి బిడ్డలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇకపై పోడు భూములకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు.
గిరివికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు మేలు చేస్తున్నామనీ, పట్టాదారులు తమ భూముల్లో బోర్లు వేసుకునేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిజేస్తామని వెల్లడించారు. త్రీ ఫేజ్ కరెంట్ కూడా సరఫరా చేస్తామని చెప్పారు. పోడు రైతులపై ఉన్న కేసులను కూడా ప్రభుత్వం ఎత్తివేస్తుందని స్పష్టం చేశారు. హక్కుదారులు తమ భూములను అమ్ముకోవడానికి వీలు లేదనీ, వారసులకు మాత్రమే పోడు భూములపై హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందని తెలిపారు. తొమ్మిదేళ్లలో ఏజెన్సీలోని గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.