ఒంటిపై చిన్న గాయం కూడా లేదే, ఎలా చనిపోయింది.. చిరుత మరణంపై వీడని మిస్టరీ

By Siva KodatiFirst Published Jul 20, 2021, 9:12 PM IST
Highlights

మెదక్ జిల్లాలో కలకలం రేపిన చిరుత మృతదేహానికి అటవీ శాఖ అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి ఖననం చేశారు. అయితే చిరుత మృతదేహంపై గాయాలు, ఉచ్చులు, విద్యుత్ పెట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో దాని మరణంపై మిస్టరీ నెలకొంది. 

మెదక్ జిల్లాలో చనిపోయిన చిరుతకు తెలంగాణ అటవీ శాఖ పోస్టు మార్టమ్ నిర్వహించింది. శంకరంపేట్ (ఆర్) వెటర్నటీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ గీత ఆధ్వర్యంలో పోస్టు మార్టమ్ నిర్వహించారు. అయితే చిరుత మృతికి స్పష్టమైన కారణాలు తెలియ రాలేదు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవు. అలాగే ఉచ్చులు, విద్యుత్ పెట్టిన ఆనవాళ్లు కూడా లభించలేదు. తోకపైన మాత్రం ముళ్లపందికి సంబంధించిన ముళ్లను గుర్తించారు. దీంతో చిరుత మృతికి కారణాలను గుర్తించేందుకు అంతర్గత అవయవాలను సేకరించిన డాక్టర్లు తదుపరి పరీక్షల కోసం సంగారెడ్డి వెటర్నిటీ ల్యాబ్ కు తరలించారు. చిరుత మృతదేహాన్ని అధికారుల సమక్షంలో ఖననం చేశారు. 

అంతకు ముందు..  ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా రామాయంపేట్ రేంజ్ ఖాజాపూర్ రిజర్వు ఫారెస్ట్ పరిధి పటేల్ చెరువులో చిరుత మృతదేహాన్ని చూసిన ఖాజాపూర్ గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది, చిరుత మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి, వెటర్నటీ డాక్టర్ల సమక్షంలో పరిశీలించారు. అలాగే పరిసరాల్లో గాలించి ప్రమాద కారణాలను ఆరాతీశారు. చిరుత గోర్లు యథావిధిగా ఉండటం, శరీరం బయట ఎలాంటి గాయాలు లేకపోవటంతో వేటగాళ్ల ప్రమేయం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

click me!