ఖమ్మంలో మొండెం లేని ‘తల’...!

By AN TeluguFirst Published Jul 2, 2021, 10:47 AM IST
Highlights

ఖమ్మంలో చర్చి కాంపౌండ్ సమీపంలో మనిషి తల మాత్రమే కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కేవలం తల మాత్రమే ఉండడంతో ఎక్కడో హత్యచేసి ..తలను ఇక్కడ పడేసి ఉంటారని అనుమానించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ రావడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 

ఖమ్మంలో చర్చి కాంపౌండ్ సమీపంలో మనిషి తల మాత్రమే కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కేవలం తల మాత్రమే ఉండడంతో ఎక్కడో హత్యచేసి ..తలను ఇక్కడ పడేసి ఉంటారని అనుమానించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ రావడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఆ తలను ఓ సంచిలో వేసి అక్కడి నుంచి తొలగించారు.

అసలేం జరిగిందంటే.. ఖమ్మం రైల్వే లో గ్యాంగ్ మేన్ గా పనిచేస్తూ.. రైల్వే క్వార్టర్స్ లో ఉంటున్న గుగులోతు రాంజీ కుమారుడు గుగులోతు రాజు (28) కు గత ఏడాది వివాహం జరిగింది. రెండు నెలల క్రితం భార్య ప్రసవించి పుట్టింట్లో ఉంది.  ఈ క్రమంలో రాజు గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు.  

బుధవారం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తండ్రి తో గొడవ పడ్డాడు.  ఆయన ఇవ్వనని చెప్పడంతో మనస్థాపానికి గురై రాత్రి 9:30 గంటల ప్రాంతంలో నగరంలోని నర్తకి థియేటర్ సమీపంలో రైలు వస్తున్న సమయంలో ఎదురుగా వెళ్లి పట్టాలపై తల పెట్టాడు.  దీంతో తల మొండెం రెండుగా వేరే అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ విషయాన్ని లోకో పైలెట్ ఖమ్మం స్టేషన్ మాస్టర్ కు తెలియజేశారు. రైల్వే పోలీసులు (జిఆర్ పి) మృతదేహం కోసం ప్రకాష్ నగర్ రైల్వే వంతెన దగ్గర నుంచి ధంసలాపురం గేట్ వరకు వెతికారు. మృతదేహం లభించకపోవడం, అప్పటికే వర్షం ప్రారంభం కావడంతో వెనక్కి వచ్చేశారు. గురువారం ఉదయం నర్తకి థియేటర్ ఎదురుగా రైలు పట్టాలపై శవం పడి ఉండడాన్ని గమనించిన ఓ కుక్క మొండెం నుంచి వేరైన తలను పట్టుకుని పరుగు లంకించుకుంది. దానిని ప్రకాష్ నగర్ వంతెన వద్ద రోడ్డు పైనే పడేసి వెళ్ళిపోయింది.

ఉదయం నర్తకి థియేటర్ వద్ద రాజు మొండాన్ని స్వాధీనం చేసుకున్న జిఆర్పి పోలీసులు తల కోసం రైలు పట్టాల వెంట వెతికారు. కానీ అది లభించలేదు. ఈ లోగా ప్రకాష్ నగర్ వంతెన వద్ద మనిషి తల ఉందని తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. అది రాజు తలగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రాజు తానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి మొండెం రైల్వే ట్రాక్ పై, తలను ప్రకాష్ నగర్ వంతెన వద్ద పడేశారా? అని అనుమానం కలిగింది. దీంతో వంతెన వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. ఓ కుక్క మనిషి తలను నోటితో పట్టుకొచ్చి వంతెన వద్ద వదిలేసినట్లు స్పష్టంగా రికార్డయింది.

click me!