ఊరు నిండా అప్పులు చేసిన కొడుకు.. కట్టలేక ఎరువుల వ్యాపారి ఆత్మహత్య..

By AN TeluguFirst Published Dec 25, 2020, 9:34 AM IST
Highlights

కొడుకు చేసిన అప్పులు చెల్లించాలని బ్యాంకర్లు, ఫైనాన్స్ నిర్వాహకులు ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నారని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోనూర్ లో జరిగింది. 

కొడుకు చేసిన అప్పులు చెల్లించాలని బ్యాంకర్లు, ఫైనాన్స్ నిర్వాహకులు ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నారని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోనూర్ లో జరిగింది. 

వివరాల్లోకి వెడితే.. స్థానిక లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు తీర్థాల భాస్కర్ పెద్ద ఎత్తున ఎరువుల వ్యాపారం చేస్తుంటాడు. ఆయన పెద్ద కొడుకు వెంకటేష్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి నష్టాల్లో ఉన్నాడు. దీంతో రెండేళ్ల కింద స్వగ్రామానికి వచ్చి ఫైనాన్సులో లారీ తీసుకుని అద్దెకు నడుపుతున్నాడు. దీంట్లో లాభాలు బాగానే వస్తుండడంతో రకరకాల ప్రైవేట్ బ్యాంకర్లు, ఫైనాన్షియర్ల దగ్గర డబ్బు తీసుకుని ఏడు లారీలు కొన్నాడు.

వారి దగ్గర చేసిన అప్పుకు వడ్డీకింద నెలకు ఐదు లక్షల వడ్డీ చెల్లించేవాడు. కరోనా లాక్ డౌన్ తో వ్యాపారం సాగకపోవడంతో నెలవారీ కిస్తీలు ఐదులక్షలు చెల్లించలేక పోయాడు. దీంతో నెలనెలా కట్టాల్సిన డబ్బు పెరిగిపోయింది. 

దీంతో వెంకటేష్ హైదరాబాద్ కు వెళ్లిపోయి అక్కడే ఉంటున్నాడు. వెంకటేష్ అందుబాటులో లేకపోవడంతో అతను చెల్లించాల్సిన సొమ్ము కట్టాలంటూ బ్యాంకర్లు, ఫైనాన్షియర్లు తండ్రి భాస్కర్ ను వేధించడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భాస్కర్ గురువారం గ్రామ శివారులో ఉన్న తన పంట చేనుకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

తన చావుకు బ్యాంకర్లు, ఫైనాన్షియర్లే కారణమని సూసైడ్ నోట్ రాశాడు. తన షర్ట్ మీద కూడా వారి పేర్లు, సెల్ ఫోన్ నెంబర్లు రాసుకున్నాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!