50వేల ఓట్ల గల్లంతు.. రీపోలింగ్ పెట్టాలని డిమాండ్

By ramya neerukondaFirst Published Dec 8, 2018, 9:50 AM IST
Highlights

తాను బరిలో ఉన్న మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో దాదాపు 50వేల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని, పలు ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద జాబితాలో పేరు లేకపోవడంతో తాము ఓటు వేయలేక పోయామని పౌరులు నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ శుక్రవారంతో పూర్తయ్యింది. ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. కాగా.. నిన్న జరిగిన పోలింగ్ లో చాలా ప్రాంతాల్లో ఓటర్లకు ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు కూడా. అయితే.. మల్కాజ్ గిరి ప్రజా కూటమి అభ్యర్థి తమ నియోజకవర్గంలో తిరిగి రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

మల్కాజ్‌గిరిలో రీ పోలింగ్‌ నిర్వహించాలని ప్రజాకూటమి తరపున పోటీ చేసిన తెలంగాణ జన సమితి అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓ సునీల్‌ ఆరోరాకు వినతిపత్రం పంపారు. తాను బరిలో ఉన్న మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో దాదాపు 50వేల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని, పలు ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద జాబితాలో పేరు లేకపోవడంతో తాము ఓటు వేయలేక పోయామని పౌరులు నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. 

ఇంత భారీ స్థాయిలో పేర్లు గల్లంతవడం ఫలితాలపై ప్రభావం చూపుతుందన్నారు. కొందరు ఓటర్లకు 15నుంచి 20కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను కేటాయించారని, దీంతో పలువురు పోలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదన్నారు. సిబ్బంది ఇంటింటికి పోలింగ్‌ స్లిప్పులు కూడా ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. ఆయా అంశాలను దృష్టిలో ఉంచుకొని జాబితాలో గల్లంతైన ఓటర్లు పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఆ తరువాత రీ పోలింగ్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఓట్ల లెక్కింపు తేదీని పొడిగించి రీ పోలింగ్‌ నిర్వహించాలన్నారు.
 

click me!