
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహాకూటమి స్పీడ్ పెంచింది. మహాకూటమిలోని పార్టీలన్నీ కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి సమయం సమీపిస్తుండటంతో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి భట్టి విక్రమార్క, టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు,టీజేఎస్ నుంచి దిలీప్ కుమార్ లు హాజరయ్యారు.
ఉమ్మడి మేనిఫెస్టోపై విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై కసరత్తు ముగిసిందని నేతలు చెప్పుకొచ్చారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో ప్రాధాన్యత కల్పించామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యాతనిచ్చామని తెలిపారు.
నిధులు, నీళ్లు, నియామకాలే లక్ష్యంగా ఉమ్మడి ప్రణాళిక డ్రాఫ్ట్ సిద్ధం చేశామని టీజేఎస్ నేత దిలీప్ కుమార్ వెల్లడించారు. మొదటి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఏకకాలంలో రూ.2లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. ప్రాజెక్టులపై రివ్యూ చేస్తామని దిలీప్ కుమార్ తెలిపారు.
అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉమ్మడి ప్రణాళిక రూపొందించామని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
ప్రతీ వర్గానికి అండగా ఉండేలా ఉమ్మడి ప్రణాళిక రూపొందించినట్లు సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తెలిపారు. నాలుగు పార్టీల మేనిఫెస్టోలను ఎక్స్చేంజ్ చేసుకున్నామని, మేనిఫెస్టో డ్రాఫ్ట్ ని పార్టీ అధ్యక్షులకు పంపుతామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవంలో కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు. జోన్ల పెరుతో ప్రజలని మోసం చేశారని విమర్శించారు.
ఉద్యోగ నియామకాల కోసం ప్రతి ఏటా క్యాలెండర్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం చేసిన రెండు లక్షల కోట్ల అప్పు ప్రాజెక్టులకే కేటాయించారని ఆరోపించారు. ప్రతి పేదవాడికి నివాసం కల్పించాలని నిర్ణయించామన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ఉద్యోగ క్రమబద్ధీకరణపై చర్చించామన్నారు. కొత్తదనంతో కూడిన పాలన ఉంటుందని అన్నారు