
హైదరాబాద్: ఇప్పుడు సనత్నగర్ పోలీసు స్టేషన్లో ఓ లైబ్రరీ ఏర్పాటైంది. ఓ చిన్నారి బాలిక చేసిన విజ్ఞప్తికి మురిసిపోయిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పీఎస్లో గ్రంథాయలం ఏర్పాటును ఆమోదించారు. ఆ చిన్నారి బాలిక కలగన్నట్టుగానే ఆమె చేతుల మీదుగా ఆ లైబ్రరీని ఓపెన్ చేయించారు. అనంతరం, ఈ లైబ్రరీ అందరికీ అందుబాటులో ఉంటుందని సీపీ స్టీఫెన్ రవీంద్ర ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎందరో ఇక్కడ పుస్తకాలు తిరగేసి తమ జీవిత పుటల్లో కొత్త అధ్యాయాలు రాసుకుంటారని ఆశిస్తున్నట్టు వివరించారు.
గతేడాది డిసెంబర్ 31వ తేదీతో ఓ లేఖ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు అందింది. బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల చిన్నారి ఆకర్షణ సతీష్ తన విజ్ఞప్తిని రాసి లేఖ రూపంలో సీపీకి పంపించారు. సనత్నగర్కు చెందిన ఆ ఆకర్షణ సతీష్ సనత్నగర్ పోలీసు స్టేషన్లో లైబ్రరీ ఉండాలని తలచింది. అదే విషయాన్ని సీపీకి తెలిపింది. గతంలో అంటే 2021 జులైలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో లైబ్రరీని ప్రారంభించే అవకాశం తనకు దక్కిందని గుర్తు చేసుకుంది. అదే విధంగా సనత్నగర్ పీఎస్లోనూ లైబ్రరీ ఉండాలని కాంక్షిస్తున్నట్టు పేర్కొంది.
Also Read: ఫిబ్రవరి 22న ఢిల్లీ మేయర్ ఎన్నికలు.. సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదనను ఆమోదించిన ఎల్జీ సక్సేనా
ఈ లేఖ అందగానే సీపీ స్టీఫెన్ రవీంద్ర సంతోషించారు. ట్విట్టర్లో ఆ సంతోషాన్ని పంచుకున్నారు. నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలు అని పేర్కొన్నారు. పీఎస్లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరుకున్న సిక్స్త్ గ్రేడ్ ఆకర్షణ సతీష్ను అభినందించారు. పీఎస్లోకి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారు ఈ లైబ్రరీ సేవలను పొందుతారని భావించిందని తెలిపారు.
మంచి వైపు ఒక అడుగు అని పేర్కొంటూ.. చిన్నారి బాలిక విజ్ఞప్తిలోని సిన్సియారిటీ తనకు నచ్చిందని స్టీఫెన్ రవీంద్ర తన ట్వీట్లో పేర్కొన్నారు. తాను లైబ్రరీ పెట్టడానికి ఆమోదం తెలిపానని వివరించారు. సనత్నగర్ పీఎస్లో లైబ్రరీని ప్రారంభించినట్టు వెల్లడించారు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఆవిష్కరణల దారిలో ముందు శ్రేణిలో సైబరాబాద్ పోలీసులు అంటూ లైబ్రరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు.