
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రత్యర్థులపై విమర్శలు కురిపించడమే కాకుండా.. సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా తన కుటుంబం గురించి ఆసక్తికర విషయం వెల్లడించిన కేటీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. తన కుటంబం నుంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తన అమ్మ వాళ్ల తండ్రి జే కేశవరావు గురించి చెప్పుకొచ్చారు. ఆయన తెలంగాణ తిరుగుబాటులో భాగంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. తన కుటుంబానికి ప్రజా సమస్యలు, గొప్ప మేలు కోసం పోరాడిన చరిత్ర ఉందని.. అందుకు భారతీయుడిగా, తెలంగాణ వాసిగా గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా వెల్లడించారు.
‘‘నా కుటుంబం నుంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేస్తాను. మా అమ్మ వాళ్ల నాన్న జె కేశవ రావు.. గాంధీజీ స్ఫూర్తితో 1940ల చివర్లో తెలంగాణ తిరుగుబాటులో భాగంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా భారత ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందారు. నా కుటుంబానికి ప్రజా సమస్యలు, గొప్ప మేలు కోసం పోరాడిన చరిత్ర ఉంది. అందుకు భారతీయుడిగా, తెలంగాణ వాసిగా ఫీలవుతున్నాను’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు ఎంత మంది స్వాతంత్య్ర ఉద్యమంలో ఏదైనా పాత్ర ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. వారికి సంబంధం లేని విషయాలను కూడా తమదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారని కేటీఆర్ విమర్శించారు.