ఆ రెండు పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వండి.. దిగ్విజయ్ సింగ్‌కు కొండా సురేఖ లేఖ

By Sumanth KanukulaFirst Published Dec 26, 2022, 4:12 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలతో చెలరేగిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు మాజీ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. 

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలతో చెలరేగిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు మాజీ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వాలని కొండా సురేఖ ఆ లేఖలో కోరారు. తొలుత పీసీసీ కమిటీల కూర్పుపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన కంటే జూనియర్లకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చారని, తనను ఎగ్జిక్యూటీవ్ కమిటీకి పరిమితం చేయడం బాధ కలిగించిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఎగ్జిక్యూటీవ్ కమిటీకి ఆమె రాజీనామా చేశారు. 

అయితే తాజాగా దిగ్విజయ్ సింగ్‌కు లేఖ రాసిన కొండా సురేఖ..  27 ఏళ్ల  రాజకీయ అనుభవం కలిగిన తనను ఏఐసీసీ కార్యదర్శిగా లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా అడిగినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన సమయంలో ఆయనను కలవలేకపోయినందుకు చింతిస్తున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. తాను 1995 నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని లేఖలో పేర్కొన్నారు. తన భర్త కొండా మురళీధర్ రావు రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు చెప్పారు. తామిద్దరం వెనుబడిన తరగతుల నుంచి వచ్చామని చెప్పారు. 

తాను చేసిన ప్రజా సేవ, రాజకీ అనుభవం నేపథ్యంలో ఏఐసీసీ సెక్రటరీ లేదా పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్‌లకు తాను అర్హురాలినని బలంగా నమ్ముతున్నానని చెప్పారు.  ఈ రెండు పదవుల్లో ఏదో  ఒకటి ఇస్తే.. వాటికి న్యాయం చేస్తానని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. పీసీసీ కమిటీల కూర్పుపై పలువురు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. టీ కాంగ్రెస్‌లో అలజడి రేగింది. ఈ క్రమంలోనే కాంగ్రస్ అధిష్టానం నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను తమ దూతగా తెలంగాణకు పంపింది. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీ ఇంచార్జ్ సెక్రటరీలు, తెలంగాణ ముఖ్య నేతలతో చర్చించారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. వారికి కొన్ని సూచనలు కూడా చేశారు. పార్టీ‌లో సమస్యలు ఉంటే నేతలు అధిష్టానం దృష్టికి తీసుకురావాలని, మీడియా ముందు మాట్లాడొద్దని కోరారు. దిగ్విజయ్ సింట్ టూర్ తర్వాత పరిస్థితి సద్దుమగుణుతుందని అంతా భావించారు. 

అయితే కొందరు నేతలు మాత్రం దిగ్విజయ్ సింగ్‌ మాటలు పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పటికే ఒకరిద్దరు నేతలు మీడియా ముందుకు వచ్చి కామెంట్స్ కూడా చేశారు. 

click me!