టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను చేయాలనే విషయంపై బహిరంగంగానే చర్చ సాగుతోంది. ఈ స్థితిలో కేటీఆర్ ను సీఎంను చేస్తే తప్పేమిటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేమిటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు. ఈ విషయంపై తగిన సమయంలో ముఖ్యంమత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తలాసని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బిజెపి నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గతంలో నీల్లు లేక రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారని ఆయన చెప్పారు కాళేశ్వరంపై మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావును తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ను సీఎం చేయాలని గత కొంత కాలంగా కొంత మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ డిమాండ్ చేశారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ముఖ్యమంత్రిగా కేటీఆర్ సమర్థుడని, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని షకీల్ అన్నారు. యువనేత కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
తనతో పాటు మరింత మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ఆశీర్వదించాలని ఆయన అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మరో ఎమ్మెల్యే బాజిరెడ్డి అన్నారు. తనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అదే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ ఆలోచించి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అన్నారు.