ఈటెలకు కేసీఆర్ షాక్: కీలక శాఖలన్నీ తన వద్దే

By telugu teamFirst Published Feb 20, 2019, 7:54 AM IST
Highlights

గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించిన ఈటెల రాజేందర్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ అంత ప్రాధాన్యం లేని శాఖనే కేసీఆర్ కేటాయించారు. ఆర్థిక శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచున్నారు. తన తనయుడు కేటీ రామారావు, మేనల్లుడు హరీష్ రావు నిర్వహించిన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రులకూ షాక్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో పలువురు సీనియర్లకు షాక్ ఇచ్చిన ఆయన శాఖల కేటాయింపులో కొత్త మంత్రులకూ షాక్ ఇచ్చారు. 

గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించిన ఈటెల రాజేందర్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ అంత ప్రాధాన్యం లేని శాఖనే కేసీఆర్ కేటాయించారు. ఆర్థిక శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచున్నారు. తన తనయుడు కేటీ రామారావు, మేనల్లుడు హరీష్ రావు నిర్వహించిన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. 

ఫైనాన్స్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి, ఐటి, పరిశ్రమల వంటి అతి కీలకమైన శాఖలను కేసీఆర్ తన వద్ద ఉంచుకున్నారు. 2019 - 20 ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్ ను ఈ నెల 22వ తేదీన తానే శాసనసభలో ప్రతిపాదించడానికి సిద్ధపడ్డారు. 

శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖను మంత్రి తొలిసారి మంత్రి పదవి చేపట్టిన వేముల ప్రశాంత్ రెడ్డికి ఇచ్చారు. ఇంద్రకరణ్ రెడ్డికి అదనంగా అటవీ శాఖను కేటాయించారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన దేవాదాయ, న్యాయ శాఖలతో పాటు ఇంద్రకరణ్ రెడ్డికి అటవీ శాఖను కేటాయించారు. 

గత ప్రభుత్వంలో చేపట్టిన విద్యుచ్ఛక్తి శాఖను జగదీష్ రెడ్డి నుంచి కేసీఆర్ తీసేసుకున్నారు. జగదీష్ రెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. తలసాని శ్రీనివాస యాదవ్ కు గత ప్రభుత్వంలో నిర్వహించిన పశు సంవర్ధక శాఖనే కేటాయించారు. 

click me!