
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని తుమ్మలూర్ మండలంలో హరితోత్సవం కార్యక్రంలో కేసీఆర్ పాల్గొన్నారు. తుమ్మలూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కుకు చేరుకున్న కేసీఆర్కు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. తర్వాత పార్కులో సఫారీ వాహనంలో కేసీఆర్ కలియదిరిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని వీక్షించారు. ఈ సందర్బంగా తుమ్మలూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో కేసీఆర్ మొక్క నాటారు.
అనంతరం హరితోత్సవ బహిరంగ సభలో పాల్గొనేందుకు బయలుదేరారు. మరికాసేపట్లో బహిరంగ సభ వేదిక నుంచి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇక, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల వేడుకల్లో భాగంగా జూన్ 19న 'హరితోత్సవం' నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రజలు తమ బిడ్డను ఎలా పెంచుకుంటారో అదే విధంగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని గతంలో కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక, తెలంగాణ ప్రభుత్వం ‘హరితహారం’ తొమ్మిదో దశలో 19.29 కోట్ల మొక్కలు నాటాలని యోచిస్తోంది.