అసెంబ్లీ రద్దుకు కారణమిదే: తేల్చేసిన కేసీఆర్

By narsimha lodeFirst Published Sep 6, 2018, 3:03 PM IST
Highlights

రాష్ట్రంలో రాజకీయ అసహన వైఖరి పెరిగిపోయిందని  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. 

హైదరాబాద్:రాష్ట్రంలో రాజకీయ అసహన వైఖరి పెరిగిపోయిందని  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతోందని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతోంటే విపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్రానికి సుమారు 40 అవార్డులు వచ్చినట్టు ఆయన చెప్పారు.

తెలంగాణ భవన్‌లో అపద్ధర్మ సీఎం కేసీఆర్  గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ  తీసుకొన్న నిర్ణయం తర్వాత కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అక్కడి నుండి ప్రగతి భవన్ కు చేరుకొన్నారు. ప్రగతి భవన్ నుండి మధ్యాహ్నం 2.50 నిమిషాలకు టీఆర్ఎస్ భవన్ కు చేరుకొన్నారు.

ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. పటిష్టమైన పునాది పడాలనే ఉద్దేశ్యంతోనే ఒంటరిగానే 2014 ఎన్నికల్లో పోటీ చేసినట్టు కేసీఆర్ చెప్పారు. ప్రజలు ఆశీర్వదించి ప్రజలు తమ పార్టీని ఎన్నుకొన్నట్టు ఆయన చెప్పారు.

అధికారుల కేటాయింపు లేని కారణంగా ఐదారు మాసాల పాటు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ అసహన వైఖరి కన్పిస్తోందన్నారు.

నాలుగేళ్లుగా 17.17 తెలంగాణ ఆర్థికంగా ఎదిగిందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారంగా చెప్పింది. రాష్ట్రం ఆర్థిక ఆదాయం పెరుగుదల 5 నెలల్లో 21 శాతానికి పైగా ఉన్నాయి. విపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

ప్రతిపక్షాలు కాకిగోల చేస్తున్నారని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకొంటున్నారని ఆయన చెప్పారు. ఒక్కటంటే ఒక్క ఆరోపణలపై కూడ రుజువు చేయలేదన్నారు.

తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే  ఉద్దేశ్యంతోనే అసెంబ్లీని రద్దు చేసినట్టు ఆయన చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో 76 అంశాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు.కళ్యాణలక్ష్మీ, కేజీ టూ పీజీ రెసిడెన్షియల్ స్కూల్ లాంటి పథకాలను తెచ్చినట్టు ఆయన చెప్పారు.

ప్రజల కోసం టీఆర్ఎస్ ఎన్నో త్యాగాలను చేసింది. తన 8 మాసాల తమ పదవులను  త్యాగం చేసినట్టు కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజా క్షేత్రంలోకి పోదామని ఆయన చెప్పారు. ప్రజల వద్దకు వెళ్దాం. ప్రజలకు వాస్తవాలను వివరించనున్నట్టు చెప్పారు.

గత ఐదేళ్లలో తెలంగాణ చాలా ప్రశాంతంగా ఉందన్నారు. 2014కు ముందు తెలంగాణలో బాంబుల మోత, కరెంట్ కోతలు ఉన్నాయని ఆయన చెప్పారు.  2.60 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు భయపడుతోంది. రాహుల్ గాంధీ పెద్ద బపూన్ అని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తాము ఢిల్లీకి బానిసలుగా ఉండాలని భావించడం లేదన్నారు.

click me!