
2009 నవంబర్ 29..
తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు.
50 ఏళ్లకు పైగా సాగిన పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకొచ్చిన సందర్భం.
2009 నవంబర్ 29 న తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అంటూ
ఓ బక్కప్రాణం సింహంలా గర్జించి ఢిల్లీ పీఠాన్ని కదిలించిన ఘట్టం.
ఏడేళ్ల కిందట కేసీఆర్ చేపట్టిన దీక్ష నిజంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో మరిచిపోలేని ఘట్టమే.
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు కేసీఆర్ చేపట్టిన 11 రోజుల దీక్ష ఎన్నో మలుపులు తిరిగింది.
జెండాలు, ఏజెండాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు ఏకమయ్యాయి. అన్ని వర్గాలు ఒక్కటయ్యాయి.
అలుగునూరు చౌరస్తా నుంచి నిమ్స్ ఆస్పత్రి వరకు కొనసాగిన ప్రతి ఘట్టం తెలంగాణ చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సందర్భమే.
‘కారు’పని అయిపోయింది అనుకొన్న సమయంలో.. తెలంగాణ ఉద్యమం చల్లబడింది అనుకుంటున్న సందర్భంలో కేసీఆర్ దీక్ష మళ్లీ పార్టీకి, ఉద్యమానికి ప్రాణం పోసింది.
అందుకే ఈ దీక్ష గులాబీ పార్టీకి ఇప్పటికే ఓ అపురూప ఘట్టమే.
అందుకే, రెండున్నరేళ్ల పాలన తర్వాత కూడా బంగారు తెలంగాణ పాలనపై మాట్లాడాల్సిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఆ రోజును చరిత్రలో మరిచిపోకుండా ఉండటానికి దీక్ష దివస్ తో నలుమూలాల జరుపుకుంటుంది.
ఇదంతా బాగానే ఉంది. కానీ, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా ఆ 11 రోజులు కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరిగినా తమ ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమానికి ఉత్ప్రేరకంగా మారింది మాత్రం విద్యార్థులే.
శ్రీకాంతచారి బలవన్మరణం ఎందరినో కదిలించింది. కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మహత్య మరెందరినో ఉద్యమ బాట పట్టింది. ఇవన్నీ కేసీఆర్ దీక్ష జరిగిని రోజుల్లోనే జరిగినవే. మరి వీటని ఇదే స్థాయిలో గులాబీ పార్టీ నిర్వహిస్తుందా లేదా... వారి త్యాగాలు మా పార్టీ కోసం కాదు కదా అని లైట్ తీసుకుంటుందా అని తెలియాల్సి ఉంది.