మునుగోడు బైపోల్ 2022: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపిన టీఆర్ఎస్

By narsimha lodeFirst Published Oct 7, 2022, 12:06 PM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(టీఆర్ఎస్) అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును కేసీఆర్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. 

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అభ్యర్ధిగా  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. సీఎం కేసీఆర్  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును శుక్రవారం నాడు  ప్రకటించారు.ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచి కొనసాగుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్ధిగా కేసీఆర్ ప్రకటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టులను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్  ఈ నిర్ణయం తీసుకున్నారు

2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.  ఓటమి పాలైన తర్వాత కూడా నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

also read:మునుగోడు బైపోల్ 2022: గూడపూర్ వద్ద రూ. 13 లక్షల నగదు సీజ్

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  నిర్వహించిన పలు  సర్వేల్లో  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి అనుకూలంగా ఫలితాలు ఉన్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని పార్టీలోని అసంతృప్త నేతలు గతంలోనే తేల్చి చెప్పారు. అసంతృప్త నేతలను గతంలోనే మంత్రి జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లారు. అభ్యర్ధి ఎవరైనా కూడా విజయం కోసం అందరూ పనిచేయాలని సీఎం కేసీఆర్ అసంతృప్తులను కోరారు.  ఈ విషయమై అందరూ సమ్మతించారు. ఈ సమావేశం ముగిసిన రెండు రోజులకే  అసమ్మతివాదులు సమావేశం నిర్వహించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే తాము సహకరించబోమని తేల్చి చెప్పారు ఈ అసమ్మతి వాదుల్లో ఒకరిద్దరూ కీలక నేతలు బీజేపీ లో చేరారు. కూసుకుంట్ల అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలతో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపారు. 

ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ  ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లు ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిని చూపారు. అయితే ఇప్పటివరకు మునుగోడు నియోజవకర్గంలో సాగుతున్న పార్టీ కార్యక్రమాల్లో మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లు పాల్గొనలేదు.  తమకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం లేదని  మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రకటించారు.  ఈ విషయమై మంత్రి జగదీష్  రెడ్డి స్పందించారు. పార్టీ కార్యక్రమాల సమాచారం అందరికీ అందిస్తామని తెలిపారు.ఈ ప్రకటన చేసిన తర్వాత పార్టీ ఆత్మీయ సమ్మేళ్లనాల సమాచారం తమకు రాలేదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రకటించారు. తనను అవమానిస్తే మునుగోడు నియోజకవర్గ ప్రజలను అవమానించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇవాళ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గోన్నారు.  మనుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎవరిని బరిలోకి దింపినా పార్టీ నిర్ణయం మేరకు పనిచేయాలని కేటీఆర్ కోరారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను బూరనర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్  లు  మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు. మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతి భవన్ లో  కేసీఆర్ తో భేటీ అయ్యారు.ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.

click me!