అందుకే ఆ కంటతడి: కేసీఆర్- రామలింగారెడ్డి అనుబంధానికి నిదర్శనం ఈ ఫోటో

Siva Kodati |  
Published : Aug 07, 2020, 05:55 PM IST
అందుకే ఆ కంటతడి: కేసీఆర్- రామలింగారెడ్డి అనుబంధానికి నిదర్శనం ఈ ఫోటో

సారాంశం

అనారోగ్యంతో మరణించిన దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే.

అనారోగ్యంతో మరణించిన దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. తన ఆప్తమిత్రుడిని కోల్పోయానంటూ సీఎం భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ దృశ్యాన్ని చూస్తే వారిద్దరి మధ్య ఎంతటి సన్నిహిత సంబంధం వుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కేసీఆర్- రామలింగారెడ్డి మధ్య అనుబంధాన్ని తెలిపే ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అది ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పెళ్లి నాటి చిత్రం. ఆ పెళ్లి కూడా ఓ వేదికపై జరగడం విశేషం. సదరు ఫోటోలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దంపతులు పూల దండలు మార్చుకుంటున్నారు.

Also Read:దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి: కేసీఆర్ నివాళులు

కేసీఆర్ ఎదురుగా కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆ వెనకే ఓ బ్యానర్ సైతం కట్టి వుంది. దానిపై ఎస్.రామలింగారెడ్డి- సుజాతల సభా వివాహానికి సుస్వాగతం అని రాసి వుంది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ కవి కాళోజీ నిర్వహించారు. అతిథులుగా విజయరామారావు, కేసీఆర్ హాజరయ్యారు.

కాగా తెలంగాణ మలిదశ ఉద్యమం తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే రామలింగారెడ్డి కేసీఆర్ వెంటే నడిచారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా రామలింగారెడ్డితో ముఖ్యమంత్రికి మంచి అనుబంధం వుంది. ఆయన 2004, 2008 ఉప ఎన్నికల్లో దొమ్మాట నుంచి 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

రాజకీయాల్లోకి రాకముందు సుమారు 25 ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. గత  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు.

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu