
తెలంగాణలో పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎస్ పోరును మరింత ఉధృతం చేసింది. గత కొన్ని రోజులు నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలోనే రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా దీక్ష చేపట్టింది. కొద్దిసేపటి క్రితం ఈ నిరసన ప్రారంభమైంది. ఈ నిరసన దీక్షకు ముఖ్యమంత్రి కేసీఆర్, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ హాజరయ్యారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి, మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పుష్పాలు సమర్పించారు.
ఈ దీక్షలో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నాయకులు పాల్గొన్నారు. ఇందుకోసం తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నారు. ధాన్యం సేకరణలో ఒకే విధానం ఉండాలనే టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.