హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమీషనర్ సత్యనారాయణ వెల్లడించారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ విడుదల చేయడంతో కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఉపఎన్నిక నిర్వహణ పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నం అవుతోంది. నోటిఫికేషన్ విడుదల నుండి పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్.
హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహణపై కలెక్టర్ మాట్లాడారు. ఉపఎన్నికలో హుజురాబాద్ ఆర్డీవో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉంటారని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 30న పోలింగ్ జరిగి నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల నియమావళిలో భాగంగా సోషల్ డిస్టెన్స్, మాస్క్ తో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ఎలక్షన్ కోడ్ తక్షణమే అమలులోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు.
వీడియో
కరీంనగర్ జిల్లా పరిధిలోని వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్ మండలాలతో పాటు వరంగల్ జిల్లాలోని కమలాపూర్ మండలంలో ఎన్నికల ఆంక్షలుంటాయని కలెక్టర్ తెలిపారు. హుజురాబాద్ ఎన్నికలు ముగిసేవరకు కమలాపూర్ మండలం కూడా తమ పరిధిలోనే వుంటుందని కరీంనగర్ కలెక్టర్ తెలిపారు.
read more హుజూరాబాద్, బద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల: సభలపై ఈసీ ఆంక్షలు
ఎన్నికల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు పోలింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకుని వుండాలన్నారు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే ఎన్నికల విధుల్లోగానీ, పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడానికి అనుమతిస్తామన్నారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు సైతం వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పారు.
మరోవైపు ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కూడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడాలని తమకు స్పష్టమైన ఆదేశాలు అందాయని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ఈ క్రమంలో నాయకులు కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటించాలని... రాజకీయ పార్టీల ర్యాలీలకు సభలకు పర్మిషన్ తీసుకోవాలి సిపి కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో తనిఖీలు జరుగుతాయని... మద్యం, నగదు పంపిణీలపై పర్యవేక్షణ ఉంటుందని సిపి చెప్పారు.