
Brutal murder of youth in school premises: పాఠశాల ఆవరణలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు మరికొంతమందితో కలిసి పాఠశాలలో మద్యం సేవించడం, ఆ తర్వాత ఈ దారుణం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ టౌన్ లోని విద్యానగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో పీటీసీ రోడ్డులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని పురంశెట్టి నరేందర్ గా పోలీసులు గుర్తించారు. ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన ఒక మూతపడ్డ ప్రయివేటు పాఠశాల ఆవరణలో చోటుచేసుకుంది. మృతుడు నరేందర్ తో పాటు మరికొందరు కలసి ఆ ప్రాంతంలో మద్యం సేవించినట్లు ఆనవాళ్లు లభించాయని పోలీసులు తెలిపారు.
నరేందర్ తో కలసి మద్యం సేవించిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు ఈ సంఘటనకు కారణంగా తెలుస్తోందని స్థానికులు చెబుతున్న వివరాలు పేర్కొంటున్నాయి. నరేందర్ సంతోష్ నగర్ లో నివాసముంటున్నాడనీ, ఇటీవలే ఆస్ట్రేలియాలో ఉండి వచ్చాడని పోలీసులు తెలిపారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, టూ టౌన్ సీఐ లక్ష్మిబాబులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.