CP V.C. Sajjanarఎన్ కౌంటర్ స్పెషలిస్ట్: ఎవరీ వీసీ సజ్జనార్?

By telugu teamFirst Published Dec 6, 2019, 12:16 PM IST
Highlights

వెటర్నరీ డాక్టర్ రేప్, హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం ద్వారా మరోసారి వీసీ సజ్జనార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సజ్జనార్ కు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరుంది. ఎంతకు ఎవరీయన?

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనను ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా కూడా పిలుస్తున్నారు. తీవ్రమైన నేరారోపణలు ఉన్న వెటర్నరీ డాక్టర్ కేసు కాబట్టి ఆయనపై ఇప్పటికిప్పుడు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా సజ్జనార్ తీవ్రమైన చిక్కులనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

సజ్జనార్ గతంలో చేసిన చర్యలకు ఇప్పటికీ కోర్టు కేసులో ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది. ఓసారి ప్రమోషన్ కూడా ఆగిపోయినట్లు సమాచారం. రావాల్సిన రివార్డులకు కూడా దూరమయ్యారు. అయినప్పటికీ ఆయన తన పంథాను మార్చుకోలేదు. 2008లో వరంగల్ లో అమ్మాయిలపై యాసిడ్ పోసిన ముగ్గురు యువకులను ఎన్ కౌంటర్ చేసిన ఘటన ద్వారా ఆయన హీరో అయ్యారు. 

Also Read: దిశ రేప్, హత్య కేసు: అర్థరాత్రి నలుగురు నిందితుల కాల్చివేత

సజ్డనార్ కర్ణాటక రాష్ట్రంలో ధార్వాడ జిల్లా కేంద్రం హుబ్బలీకి చెందినవారు. 1996 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్. రాష్ట్ర విభజన తర్వాత ఆయనను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఆయన ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా పనిచేస్తున్నారు. వృత్తిపరంగా తన కింది ఉద్యోగులతో చాలా అన్యోన్యంగా ఉంటారని చెబుతారు. కింది ఉద్యోగులు ఆయనను చాలా ఇష్టపడుతారు. 

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కిందికి హైదరాబాద్ చుట్టుపక్కల గల రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలు వస్తాయి. పోలీసులకు కొరకరాని కొయ్యగా గల ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లు ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. 

Also Read: Disha murder case: ఎన్ కౌంటర్ తో కథ ముగియలేదు.. అసలు కథ ఇప్పుడే

సజ్జనార్ 2018 మార్చి 14వ తేదీన సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.  గ్యాంగస్టర్ నయీం ఎన్ కౌంటర్ లో కూడా సజ్జనార్ కీలక పాత్ర పోషించారు. నయీం ఎన్ కౌంటర్ సమయంలో ఆయన స్పెషల్ ఇంటలిజెన్స్ విభాగం ఐజీగా ఉన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అలిపిరి వద్ద మావోయిస్టుల దాడి కేసులో కీలక సూత్రధారిగా భావించిన నక్సల్స్ నేత సుధాకర్ రెడ్డి ఎన్ కౌంటర్ లో కూడా సజ్జనార్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. 

Also Read: మా కూతురు ఆత్మకు శాంతి కలిగింది: నిందితుల ఎన్‌కౌంటర్ పై దిశ ఫ్యామిలీ

సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఓ కీలకమైన ప్రకటన చేశారు. మహిళలు, పిల్లల సంరక్షణకు తాను ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. 

సజ్జనార్ శాకాహారి అని ఆయన సన్నిహితులు చెబుతారు. ప్రతి రోజు ఓ గంట పాటు పూజలు కూడా చేస్తారని సమాచారం. అయితే, ఆయన వివిధ ఎన్ కౌంటర్లకు సంబంధించి ఇప్పటికీ కేసులను ఎదుర్కుంటున్నారు. నల్లగొండ ఎస్పీగా పనిచేసినప్పుడు ఆయన ప్రధాన వైట్ కాలర్ నేరాలపై దృష్టి సారించారు.  

click me!