
జర్నలిస్ట్ రఘుపై కేసు విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 16కి వాయిదా వేసింది. జర్నలిస్ట్ రఘుపై నమోదు చేసిన కేసుల వివరాలను కోర్టుకు సమర్పించాలని డీజీపీని న్యాయస్థానం అదేశించింది. ఈనెల 14లోగా కేసుల వివరాలు సమర్పించాలని హైకోర్టు సూచించింది. తన భర్త అరెస్ట్ అక్రమంటూ రఘు భార్య లక్ష్మీ పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. రఘు బెయిల్ పిటిషన్పై గురువారం విచారణ ఉన్నందున కేసుల వివరాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. అయితే కేసుల వివరాల కోసం డీజీపీకి వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. డీజీపీకి వినతిపత్రం ఇవ్వాలని ఒత్తిడి చేయకుండా కేసుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది.
కాగా, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రబోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన రఘును మధ్యలో అడ్డుకుని జీపులో ఎక్కించారు. అయితే పోలీసులు రఘును అదుపులోకి తీసుకున్న తీరు.. అరెస్ట్కు ముందు కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం అందించకపోవడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read:నా భర్తది అక్రమ అరెస్ట్: హైకోర్టును ఆశ్రయించిన రఘు భార్య లక్ష్మీప్రవీణ
మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా ఉన్నాడు జర్నలిస్ట్ రఘు. అసలు ఈ గుర్రంపోడు వివాదం ఏంటంటే... టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గిరిజనుల భూములను ఆక్రమించారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. 540 సర్వే నెంబర్లోని వివాదాస్పద భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. టీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ రేకుల షెడ్డును ధ్వంసం చేయడంతో పాటు ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లదాడికి దిగాయి. వీరిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలోని రాళ్లదాడిలో సీఐకి గాయాలయ్యాయి.