జయరాం హత్య: సిరిసిల్ల కౌన్సిలర్ భర్తను విచారిస్తున్న పోలీసులు

By telugu teamFirst Published Feb 16, 2019, 2:58 PM IST
Highlights

జయరాంను చంపిన తర్వాత అంజిరెడ్డి రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చాడని, జయరాం శవాన్ని చూసి ఆయన పారిపోయాడని అంటున్నారు. అంజిరెడ్డితో శ్రీను, రాములు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. 

హైదరాబాద్: ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు తెలంగాణలోని సిరిసిల్ల కౌన్సిలర్ భర్త, రియల్టర్ అంజిరెడ్డిని విచారిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. శ్రీను, రాములులను పోలీసులు విచారిస్తున్నారు.

రాకేష్ రెడ్డితో వారికి గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జయరాంను చంపిన తర్వాత అంజిరెడ్డి రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చాడని, జయరాం శవాన్ని చూసి ఆయన పారిపోయాడని అంటున్నారు. అంజిరెడ్డితో శ్రీను, రాములు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, రాకేష్ రెడ్డి తనకు రూ. 10 లక్షలు అప్పు పడ్డాడని అంజిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, జయరామ్ హత్య కేసులో నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డిల పోలీసు కస్టడీని నాంపల్లి కోర్టు పొడిగించింది. ఈ కేసు విచారణలో భాగంగా శనివారం రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. 

ఇరువురు నిందితులను మరో ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అందుకు కోర్టు అనుమతినిస్తూ ఫిబ్రవరి 23 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రాకేష్ రెడ్డి అక్రమాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు వెలుగు చూశాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసు అధికారులతో, రౌడీ షీటర్ తో ఉన్న సంబంధాలు కూడా తమ దృష్టికి వచ్చాయని, ఈ నేపథ్యంలో రాకేష్ రెడ్డిని మరింతగా విచారించాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. 

యువతి గొంతుతో మాట్లాడి జయరాంను ట్రాప్ చేసినట్లు అనుమానిస్తున్న నటుడు సూర్యను కూడా మరోసారి పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యనే జయరాంను తన కారులో తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. 

click me!