Road Accident: అమెరికాలో కారు యాక్సిడెంట్.. జనగామ జిల్లా వాసి తనయుడు దుర్మరణం

By Mahesh KFirst Published Dec 21, 2021, 3:32 AM IST
Highlights

అమెరికాలోని లాస్ఏంజెల్స్‌లో కారు యాక్సిడెంట్ జరిగింది. ఇందులో జనగామ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయుడి కుమారుడు అక్కడికక్కడే మరణించాడు. జనగామకు చెందిన రామచంద్రా రెడ్డి, ఆయన భార్య, కూతుళ్లను చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు. కూతురు అక్షిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ దుర్ఘటనతో జనగామ జిల్లాలోని బండ్లగూడెంలో విషాదం నెలకొంది.
 

హైదరాబాద్: అమెరికా (America)లోని లాస్ ఏంజెల్స్‌(Los Angeles)లో జరిగిన కారు ప్రమాదం(Car Accident)లో జనగామకు చెందిన NRI కుమారుడు దుర్మరణం చెందాడు. ఆయన కూతురు ప్రాణాల కోసం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నది. ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది. ఈ దుర్ఘటనతో జనగామ(Jangaon) జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

బండ్లగూడెం గ్రామానికి చెందిన చెట్టిపల్లి రామచంద్రా రెడ్డి టెకీ. సుమారు 20 ఏళ్ల నుంచి ఆయన అమెరికాలోని జీవిస్తున్నాడు. ఆయన భార్య రజిత రెడ్డితో కలిసి అక్కడే స్థిరపడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు అర్జిత్ రెడ్డి(14), కూతురు 16 ఏళ్ల అక్షిత ఉన్నది. అమెరికా శాశ్వత నివాస కార్డుదారులు వీరు. స్నేహితుడి ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్‌కు వెళ్లి రామచంద్రా రెడ్డి కుటుంబం తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామచంద్రా రెడ్డి, రజితలు కారులో ముందు కూర్చుండగా, అర్జిత్ రెడ్డి, అక్షితలు వెనకలా కూర్చున్నారు. లాస్ ఏంజెల్స్‌లోని ఓ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపారు. అంతలోనే ఓ మహిళ మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసుకుంటూ భారీ వేగంతో వచ్చి రామచంద్రా రెడ్డి కారును వెనుక నుంచి ఢీ కొట్టింది.

Also Read: అమెరికాలో సూర్యాపేట వాసి మృతి

ఈ ఘటనలో కారులో వెనుక కూర్చున్న అర్జిత్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మిగితా ముగ్గురిని హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. ఈ ముగ్గురిలో అక్షిత ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనతో బండ్లగూడెంలో విషాదం నెలకొంది. మరో పది నిమిషాలైతే వారు తమ ఇల్లు చేరుకుంటారనే సమయంలో.. దూరంలో.. ఈ దుర్ఘటన జరిగినట్టు బండ్లగూడెంలోని రామచంద్రా రెడ్డి సహోదరుడు రవీందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రమే తమకు ఈ కారు యాక్సిడెంట్ సమాచారం తెలిసిందని వివరించారు.

రామచంద్రా రెడ్డికి బండ్లగూడెంలో 10 ఎకరాల భూమి ఉన్నది. రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి ఆయన స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటారని స్థానికులు చెప్పారు. బండ్లగూడెంల రామచంద్రా రెడ్డి కుటుంబానికి గ్రామంలో మంచి పలుకుబడి ఉన్నది. ఈ దుర్ఘటన గురించి తెలియగానే గ్రామంలోని చాలా మంది చలించిపోయారు. అర్జిత్ రెడ్డి మరణంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Also Read: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ వాసి దుర్మరణం..!

గత నెలలో సూర్యాపేటకు చెందిన యువకుడు చిరుసాయి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సూర్యాపేట పట్టణంలోని నల్లాలబావి కాలనీకి చెందిన నరేంద్రుని లింగమూర్తి, సధారాణిల కుమారుడు చిరుసాయి (22) పై చదువుల కోసం 11 నెలల క్రితం అమెరికాకు వెళ్ళాడు. ఈ నెల 15 వ తేదీన సాయి ఇండియాకు రావాల్సింది. ఈ నేపథ్యంలో అమెరికాలో షాపింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సాయికి యాక్సిడెంట్ అయింది. భారీగా మంచు కురుస్తున్న సమయంలో సాయి డ్రైవ్ చేస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో సాయి అక్కడిక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న నల్లగొండకు చెందిన మరో యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళింది.

click me!